
కాయలు కోతకోస్తే కన్నీళ్లే
● అమ్మకానికి రోడ్డున్నపడ్డ రైతులు ● రోజుల తరబడి రోడ్డుపైనే తిండీ తిప్పలు ● వెంటాడుతున్న దొంగల భయం ● కునుకు తీయని అన్నదాతలు
నిద్రపోయి మూడు రోజులైంది..
నేను 1.50 టన్ను కాయలే తెచ్చాను. దానికి కోసం నాలుగు రోజులుగా ఈడే ఉన్నా. నిద్రపోయి మూడు రోజులు అయింది. తిండి తినాలంటే కి.మీ నడవాలి. హోటల్కు వెళ్లి తింటున్నా. తాగేదానికి నీళ్లు తెచ్చుకోవాల్సిందే. దీనికి ప్రతి రోజు రూ.700 వరకు ఖర్చు అవుతోంది. ఈ అడవిలో ఉండలేకపోతున్నాం. గాలి ఒక్క పక్క. మరో పక్క ఎండలు. రాత్రుల్లో దొంగలు వస్తారని భయం. ఏం చేయాలి..అవస్థలు పడుతున్నాం. – గోవిందస్వామినాయుడు,
ఏఎల్పురం, గుడిపాల
రోడ్డు మీదే అన్నీ
నాకు 7 ఎకరాల మామి డి తోట ఉంది. ఇప్పటికి ఒక లోడ్ కాయలను తో లాను. ఇప్పుడు మరో లోడ్ కాయలు తెచ్చాను. మూడు రోజులు అయింది. ఈ రోజుతో నాలుగో రోజు. కాయలు అన్లోడింగ్ అయ్యేందుకు మరో రెండు రోజులు పడొచ్చు. అంతా వరకు ఈ కష్టాలు తప్పవు. నీళ్లు పోసుకుని మూడు రోజులు అయింది. ఏదైనా తినాలన్న తమిళనాడు బార్డర్ నుంచి కి.మీన్నర వెళ్లాలి.
– లక్ష్మణన్, మాపాక్షి, చిత్తూరు
ఫ్యాక్టరీల వద్ద వరుస కట్టి..
ఉమ్మడి జిల్లాలో 43 ఫ్యాక్టరీలుంటే..ఇందులో 31 ఫ్యాక్టరీలు మాత్రమే తోతాపురిని కొనుగోలు చేస్తున్నాయి. ఈ ఫ్యాక్టరీల ఎదుట రైతుల బాధలు వర్ణాతీతంగా మారాయి. గుడిపాల మండలం గొల్లమడుగు ప్రాంతంలోని ఓఫ్యాక్టరీ వద్ద రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సుమారు 700కు పైగా ట్రాక్టర్లు రోడ్డుకు ఇరువైపులా ఫ్యాక్టరీ గేటు నుంచి తమిళనాడు సరిహద్దును తాకాయి. జీడీ నెల్లూరులోని ఎట్టేరి వద్ద పరిస్థితి తీవ్రతరమవుతోంది. ట్రాక్టర్లు బారులు తీరడంతో తోతాపురి ట్రాక్టర్లోనే పండవుతోంది. పూతలపట్టు, చిత్తూరు, తవణంపల్లి, ఐరాల, పెనుమూరు, కార్వేటినగరం వద్ద ఉన్న ఫ్యాక్టరీల వద్ద వందల సంఖ్యలో ట్రాక్టర్లు రోడ్లను ఆక్రమించాయి. ఈ రకంగా క్యూ కట్టడంతో రైతులు రోజులు తరబడి రోడ్డుకే పరిమితమయ్యారు. కాయలు అన్లోడింగ్ అయ్యేందుకు 5,6 రోజుల సమయం కావడంతో రైతులు రోడ్డుపైనే బస చేస్తున్నారు.
కాణిపాకం : ఉమ్మడి జిల్లాలో మామిడి రైతు సుడిగుండంలో చిక్కుకున్నారు. వీరి సమస్యలు తీరని వెతలుగా మారాయి. కాయలు కోతకొస్తే రైతులకు కన్నీళ్లు ముంచుకొస్తున్నాయి. ఫలం విక్రయానికి రోడ్డున పడుతున్నారు. రోజుల తరబడి రోడ్డుపైనే కునుకు తీస్తున్నారు. గొంతు తడుపుకోవడానికి, తిండికి తిప్పలు పడుతున్నారు. దీనికి తోడు దొంగల భయం వెంటాడుతోంది. కునుకు వేసేందుకు వణుకుతున్నారు. మామిడి విక్రయాలకు అన్నదాత అగచాట్లు పడుతున్నారు. మామిడి పంటను సాగులోకి తెచ్చేందుకు అష్టకష్టాలు పడ్డారు. ఆ కష్టానికి ప్రతిఫలం ఆస్వాదించ లేకపోతున్నారు. పంట కోతకొచ్చే సరికి పడరానిపాట్లు పడుతున్నారు. నిద్రలేని రాత్రులను గడుపుతున్నారు. కొన్నిరోజులుగా జిల్లాలోని మామిడి రైతుల పరిస్థితి ఇలా తయారైంది. ఇల్లు..వాకిలి వదిలి రోడ్డుపైనే కునుకుతీస్తూ...మామిడి పంటను అమ్ముకోవడానికి వారు అవస్థలు పడుతున్నారు.
గుక్కెడు నీటికి గగనమే
జిల్లా నలుమూలల నుంచి రైతులు వారు పండించిన పంటను కోత కోసి ఫ్యాక్టరీలకు అమ్మకానికి పెడుతున్నారు. ఈ తరుణంలో ఫ్యాక్టరీల వద్ద రైతులు అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ప్రధానంగా తాగునీటికి కూడా రైతులు ఇబ్బంది పడుతున్నారు. గొంతు తడుపుకోవడానికి కి.మీ మేర వెళ్లి తాగునీటిని కొని తెచ్చుకుంటున్నారు. చుట్టూ పక్కల, రోడ్డుకు ఇరువైపులా ఎలాంటి దుకాణాల్లో లేకపోవడంతో రోడ్లమీద వచ్చే వాహనాలను ఆశ్రయించి నీళ్ల బాటిళ్ల కోసం పరుగులు పెడుతున్నారు. అక్కడ కాలకృత్యాలకు కూడా వాటర్ బాటిళ్లే దిక్కుగా మారాయి. అలాగే ఆకలితో అలమటిస్తున్నారు. కడుపు నింపుకోవడానికి కూడా చాలా మంది హోటల్ వైపు చూస్తున్నారు. ఫ్యాక్టరీ వాళ్లు పంచి పెడుతున్న భోజనం పట్టక పలువురు హోటల్కు వెళ్తున్నారు. ఇలా రోజూ వారీగా రూ.700 వరకు ఖర్చు అవుతున్నట్లు రైతులు చెబుతున్నారు.
రెప్పవేస్తే ఒట్టు..
బండి క్యూలో పెట్టిన రోజు నుంచి అన్లోడింగ్ అయ్యే వరకు రైతు కంటిపై రెప్పవేయడం లేదు. పగలు అలా కొద్ది సేపు బండి కిందే నిద్రోతున్నారు. రాత్రుల్లో నిద్ర పట్టక అల్లాడిపోతున్నారు. కంటిపై రెప్పవేస్తే ఆ మార్గాల్లో రయ్..రయ్ మంటూ వెళ్లే వాహనాల శబ్ధాలకు ఉలిక్కిపడుతున్నారు. బలమైన గాలులు, వర్షాలకు అవస్థలు పడుతున్నారు. ఎండకు విలవిలలాడిపోతున్నారు. ఆయా ప్రాంతాల్లో కనీస నీడలు లేక ట్రాక్టర్ కింద భాగంలో తలదాచుకుంటున్నారు.

కాయలు కోతకోస్తే కన్నీళ్లే

కాయలు కోతకోస్తే కన్నీళ్లే