
అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
రేణిగుంట : తిరుపతి– రేణిగుంట రహదారిలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ సమీపంలో ఉన్న వైన్ షాప్లో వాచ్మన్ అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. వివరాలు.. తిరుపతి లీలా మహల్ సర్కిల్ వద్ద ఓ అపార్ట్మెంట్కు కాపలాగా ఉంటున్న కృష్ణారెడ్డి(65) రాత్రి వేళ రేణిగుంట సమీపంలోని వైన్ షాపులో వాచ్మన్గా పనిచేసేవాడు. ఆదివారం ఉదయం డ్యూటీ దిగిన తర్వాత గాయాలతో మృతి చెందడంపై కుటుంబీకులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు రూరల్ సీఐ మంజునాథరెడ్డి, గాజులమండ్యం ఎస్ఐ సుధాకర్ వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ను రప్పించి ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అంతర్రాష్ట్ర దోపిడీ దొంగ అరెస్ట్
తిరుపతి క్రైమ్ : కర్ణాటకలోని చిక్బళ్లాపూర్కు చెందిన కృష్ణప్ప రాజేష్ (23) అనే అంతర్రాష్ట్ర దోపిడీ దొంగను అరెస్ట్ చేసినట్లు తిరుపతి క్రైమ్ పోలీసులు ఆదివారం తెలిపారు. వివరాలు.. ఈనెల 9వ తేదీన కాటన్ మిల్ సమీపంలో నివసిస్తున్న ఫరూక్ సొంత పనులు నిమిత్తం నెల్లూరుకి వెళ్లడంతో ఆయన ఇంట్లో చోరీ జరిగింది. పలు వస్తువులతోపాటు ద్విచక్రవాహనం అపహరణకు గురైంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో నగరంలోని హరేరామ హరే కృష్ణ మందిరంలో సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న కృష్ణప్ప రాజేష్ను అదుపులోకి తీసుకుని విచారించగా పలు నేరాలు బయపడ్డాయి. నిందితుడిపై ఇదివరకే తిరుపతిలో మూడు కేసులు నమోదయ్యాయని, పలు జిల్లాల్లో దోపిడీలకు సంబంధించి జైలుకు కూడా వెళ్లి వచ్చినట్లు తెలిసింది. ఈ మేరకు నిందితుడి నుంచి ద్విచక్రవాహనంతోపాటు 11 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి