
మహిళా క్రికెటర్లకు మరింత ప్రోత్సాహం
తిరుపతి ఎడ్యుకేషన్ : క్రికెట్లో పురుషులతో సమానంగా మహిళా క్రీడాకారులు రాణిస్తున్నారని, వారిని మరింతగా ప్రోత్సహిస్తామని, తద్వారా ఉన్నత స్థాయికి ఎదుగుతారని చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ (సీడీసీఏ) అధ్యక్షుడు విజయ్కుమార్ తెలిపారు. ఈ నెల 9నుంచి 15వ తేదీ వరకు ఏసీఏ సౌత్ జోన్ అండర్–15 ఉమెన్స్ వన్డే రాష్ట్ర స్థాయి పోటీలను నెల్లూరులో నిర్వహించారు. ఈ పోటీల్లో చిత్తూరు జిల్లా జట్టు వరుసగా నెల్లూరు, కర్నూలు, అనంతపురం, కడపపై జట్లపై విజయం సాధించి ఫైనల్ విజేతగా నిలిచింది. ఆదివారం ఈ మేరకు జట్టు సభ్యులను సీడీసీఏ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. విజయ్కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని మహిళా క్రీడాకారులకు మరింత సదుపాయాలు కల్పించేందుకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. అందులో భాగంగానే తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉమెన్స్ క్రికెట్ అకాడమీ నెలకొల్పేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. మహిళా క్రికెటర్లు ఈ విజయ స్పూర్తితో అన్ని ఫార్మాట్లలో రాణించాలని ఆకాంక్షించారు.