అక్రమ సోదాలు అన్యాయం | - | Sakshi
Sakshi News home page

అక్రమ సోదాలు అన్యాయం

May 10 2025 12:17 AM | Updated on May 10 2025 12:31 AM

● చిత్తూరు ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఏపీడబ్ల్యూజేఎఫ్‌ ధర్నా

చిత్తూరు కలెక్టరేట్‌ : సాక్షి దినపత్రిక ఎడిటర్‌ ధనుంజయరెడ్డి ఇంట్లో పోలీసులు అక్రమ సోదాలు అన్యాయమని ఏపీడబ్ల్యూజేఎఫ్‌ నాయకులు మండిపడ్డారు. ఆ సంఘం నాయకులు శుక్రవారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు బి ప్రకాష్‌ మాట్లాడుతూ కొన్ని రోజులుగా పలు పత్రికా కార్యాలయాలు, పాత్రికేయులపై అటు అధికారులు, ఇటు ప్రజా ప్రతినిధులు దాడులకు తెగబడుతున్నారని దుయ్యబట్టారు. గతంలో ఎన్నడూ లేని విధానాలు ప్రస్తుతం అమలు చేయడం దారుణమన్నారు. ఏపీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర నాయకులు జయరాజ్‌ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ విధులు నిర్వహిస్తున్న పాత్రికేయులకు రక్షణ లేకుండా పోతోందన్నారు. కలంపై దాడి ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టులాంటిదన్నారు. ఆ విషయం తెలిసనప్పటికీ పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు తమ పరిమితులను దాటి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. తాజాగా సాక్షి దినపత్రిక ఎడిటర్‌ ధనుంజయరెడ్డి ఇంట్లోకి అక్రమంగా చొరబడి ఏకపక్షంగా సోదాలు చేయడం దారుణమన్నారు. ఇలాంటి చర్యలు తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. అనంతరం ఆర్డీఓ శ్రీనివాసులుకు వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నాలో ఏపీడబ్ల్యూజేఎఫ్‌ సంఘ నాయకులు కృపానందరెడ్డి, యాదవేంద్రరెడ్డి, హరిప్రసాద్‌, కేశవులు, బాలసుబ్రహ్మణ్యం, ఉమాశంకర్‌, కుపేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

జర్నలిస్టులపై అక్రమ కేసులు అనైతికం

పుంగనూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించడం పరిపాటిగా మారిందని, ఇది అనైతికమని పాత్రికేయులు ఆరోపించారు. సాక్షి దినపత్రిక ఎడిటర్‌ ధనుంజయరెడ్డి ఇంట్లో అక్రమ తనిఖీలను ఖండిస్తూ శుక్రవారం పుంగనూరులో ఏపీడబ్ల్యూజేఎఫ్‌ ప్రతినిధులు నిరసన తెలిపారు. ఈ మేరకు తహసీల్దార్‌ రాముకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, ప్రభుత్వ లోపాలను సాక్షి దినపత్రికలో ప్రచురిస్తుండడాన్ని జీర్ణించుకోలేక ప్రభుత్వం సాక్షి ఎడిటర్‌ ధనుంజయరెడ్డి ఇంట్లో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సోదాలు చేయ డం బాధకరమన్నారు. ఏపీడబ్ల్యూజేఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు మహమ్మద్‌ సైపుల్లా, నియోజకవర్గ అధ్యక్షుడు సతీష్‌కుమార్‌, ఎన్‌.రసూల్‌, మర్రిబాబు, కోటారెడ్డి ప్రసాద్‌, జగదీష్‌, కృష్ణమూర్తి, రెడ్డెప్ప, జావీద్‌, పురుషోత్తం, కార్తీక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement