
ప్రశాంతంగా గ్రూప్–1 మెయిన్స్ పరీక్ష
– 67.95 శాతం హాజరు
తిరుపతి అర్బన్: ఏపీపీఎస్సీ గ్రూప్–1 మెయిన్స్ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసిందని, 67.95 శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు జిల్లా రెవెన్యూ అధికారి నరిసింహులు తెలిపారు. తిరుపతి నగరంలో ఏర్పాటుచేసిన పరీక్ష కేంద్రాలను ఆయన తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పరీక్షలు రాసే అభ్యర్థులు అస్వస్థకు గురైతే తక్షణం వైద్య సేవలు అందించేందుకు పరీక్ష కేంద్రాల వద్ద వైద్య శిబిరం ఏర్పాటుచేసినట్టు తెలిపారు. ఓఆర్ఎస్, అత్యవసర మందులు అందుబాటులో ఉంచామని తెలిపారు. అలాగే తాగునీరు, మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. జిల్లాలో ఏపీపీఎస్సీ గ్రూప్–1, మెయిన్స్కు 911 మంది దరఖాస్తు చేసుకున్నారని, 619 (67.95 శాతం) మంది పరీక్షకు హాజరయ్యారైనట్టు తెలిపారు. 292 మంది గైర్హాజరయ్యారని తెలియజేశారు.
రైలు ఢీకొని వృద్ధుడి మృతి
దొరవారిసత్రం : పోలిరెడ్డిపాళెం రైల్వే స్టేషన్కు సమీపంలో రైలు పట్టాలు దాటుతున్న వృద్ధుడు చంద్రయ్య(65)ను ఆదివారం రైలు ఢీకొనడంతో మృతి చెందాడు. స్థానికులు, జీఆర్పీ పోలీసుల కథనం మేరకు వివరాలు... మావిళ్లపాడు గ్రామానికి చెందిన చంద్రయ్య పొలం పనులు చూసుకునేందుకు రైలు పట్టాలు దాటుతున్న సమయంలో చైన్నె నుంచి నెల్లూరు వైపునకు వెళ్లే రైలు ఢీకొంది. ఈ ప్రమాదంలో చందయ్య తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న జీఆర్పీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూళ్లూరుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు జీఆర్పీ ఎస్సై చెన్నకేశవ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
డిగ్రీ పరీక్ష సెంటర్ల మార్పుతో అవస్థలు
తిరుపతి సిటీ: ఎస్వీయూ అధికారుల తీరుతో డిగ్రీ 2వ, 4వ సెమిస్టర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు అవస్థలు తప్పడం లేదు. దేశవ్యాప్తంగా ఆదివారం జరిగిన నీట్ కోసం డిగ్రీ కళాశాలల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. డిగ్రీ పరీక్షల సెంటర్లు ఆయా కళాశాలలో ఏర్పాటుచేసినట్టు హాల్ టికెట్లలో ఉంది. అధికారులు మాత్రం నీట్ జరుగుతున్న కేంద్రాల్లో సెంటర్లు ఉన్న డిగ్రీ విద్యార్థులకు పక్కనున్న జూనియర్ కళాశాలల్లో సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని ముందుగా తెలియజేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అక్కడే విధి నిర్వహణలో ఉన్న పోలీసులు విద్యార్థులను సంబంధిత పరీక్షా కేంద్రాలకు తమ వాహనాల్లో తరలించారు.

ప్రశాంతంగా గ్రూప్–1 మెయిన్స్ పరీక్ష

ప్రశాంతంగా గ్రూప్–1 మెయిన్స్ పరీక్ష