
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
● నాయుడుపేట లాడ్జీలో వివాహితులైన ఇద్దరు ఆత్మహత్య
నాయుడుపేట టౌన్: వివాహేతర సంబంధం రెండు కుటుంబాలను విషాదంలోకి నెట్టింది. ఈ ఘటన గురువారం నాయుడుపేటలో చోటు చేసుకుంది. వివరాలు.. పోలీసుల కథనం మేరకు.. దొరవారిసత్రం మండలం, కుప్పారెడ్డిపాళెం గ్రామానికి చెంది జమ్మల సుబ్రహ్మణ్యం అలియాస్ మణి(38) అదే గ్రామంలో నివాసం ఉంటున్న దేవత శీరిష(35) మధ్య కొన్ని నెలలుగా వివాహేతర సంబంధం ఉంది. మణికి వివాహమై భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వివాదాల కారణంగా భార్య కొన్ని నెలల కిందటే పిల్లలను తీసుకుని రేణిగుంటలోని పుట్టింటికి వెళ్లింది. నాయుడుపేట పట్టణ పరిధిలోని తుమ్మూరుకు చెందిన శీరిష కుప్పారెడ్డిపాళెం గ్రామంలోని తాత ఇంట్లో పుట్టి పెరిగి అదే గ్రామంలో నివాసముంటోంది. ఆమెకు వివాహం కాగా.. భర్త ఆమెను విడిచి పెట్టి వెళ్లిపోయాడు. కొన్ని నెలలుగా మణి, శీరిష మధ్య వివాహేతర సంబంధం కారణంగా ఇరు కుటుంబాల మధ్య వివాదం నడుస్తోంది. బుధవారం సాయంత్రం మణి, శీరిష నాయుడుపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలో ఉన్న లాడ్జీలో బసచేశారు. గురువారం ఉదయం లాడ్జీ నిర్వహకులు గదిని ఖాళీ చేయాలని కోరగా.. శిరీష అక్కడి సిబ్బందితో గొడవపడ్డారు. సాయంత్రం వరకు గదిని ఖాళీ చేయకపోవడంతో అనుమానం వచ్చి కిటికీలో నుంచి చూడగా గదిలో ఇద్దరూ విగతజీవులుగా పడి ఉన్నారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు, సీఐ బాబి, ఎస్ఐ ఆదిలక్ష్మి లాడ్జీ వద్దకు చేరుకుని తలుపులు పగులగొట్టి గదిలో పరిశీలించగా.. మణి గొంతు కోసుకుని రక్తపు మడుగులో పడి ఉండడం, శీరిష ఉరేసుకుని ఉండడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరి మధ్య ఏమైనా వివాదాలు చోటు చేసుకుని శీరిష మణి గొంతు కోసి ఆపై ఆమె చున్నీతో ఉరేసుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. తిరుపతి జిల్లాకు చెందిన క్లూస్ టీమ్ క్షణ్ణంగా పరిశీలించింది. ఇద్దరి మృతదేహాలను స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఇరు కుటుంబాలను పిలిపించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.