
తెల్లరాయి దొంగలపై చర్యలేవి?
● నిత్యం జరుగుతున్న బ్లాిస్టింగ్ను వెంటనే ఆపాలి ● లేని పక్షంలో ఆందోళన చేస్తాం : శిరిషా
సైదాపురం: సైదాపురం మండలంలో తెల్లరాయి దొంగలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని మాజీ రాష్ట్ర నృత్య అకాడమీ చైర్పర్సన్ పొట్టేళ్ల శిరీషాయాదవ్ శుక్రవారం స్థానిక ఎస్ఐ క్రాంతికుమార్కు రెండో సారి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ మండలంలోని చాగణంరాజుపాళెంలోని సిద్ధి వినాయక, మండల కేంద్రమైన సైదాపురం సమీపంలోని శ్రీనివాస పద్మావతి గనుల్లో అక్రమ బ్లాస్టింగ్ జరుగుతోందంటూ గతంలో ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిదన్నారు. ఈ విషయమై ఆత్మకూరు డీఎస్పీకి కూడా ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. ముగ్గురు అమాయకులపై దాడులు చేసిన 20 మంది రౌడీ మూకలపై కూడా సమగ్ర విచారణ చేసి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమం చేపడుతామని ఆమె హెచ్చరించారు. దేశవిదేశాల్లో మంచి డిమాండ్ ఉన్న ఖనిజాన్ని అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా దోపిడీ చేస్తున్నా కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. మండలంలో నిత్యం ఖనిజాన్ని అక్రమ రవాణాతో పాటు బ్లాస్టింగ్ చేస్తున్నా కూడా సంబంధిత అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారో అర్థంకావడం లేదన్నారు. ఈ విషయమై సమగ్ర విచారణ చేపట్టాలన్నారు. ఈ మేరకు ఉన్నత స్థాయి అధికారులకు కూడా విన్నవించనున్నట్టు ఆమె పేర్కొన్నారు.
విజన్ యాక్షన్ ప్లాన్ రూపకల్పన
తిరుపతి సిటీ: స్వర్ణాంధ్ర –2047 సాధనలో భాగంగా సీఎం విజనరీకి అనుగుణంగా నియోజకవర్గాల అభివృద్ధి కోసం విజన్ యాక్షన్ ప్లాన్ రూపకల్పన చేయాలని డీఆర్వో నరసింహులు అధికారులను ఆదేశించారు. పద్మావతి మహిళా వర్సిటీలోని సావేరి సెమినార్ హాల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా అధికారులకు నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ రూపకల్పనపై శుక్రవారం వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, టీం సభ్యులు, నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లే విధంగా పథకాలు రూపొందించాలని సూచించారు. వర్క్షాపులో ఏపీ ప్రణాళిక శాఖ సంచాలకులు రావి రాంబాబు, ప్రణాళికా శాఖ సీనియర్ సలహాదారు సీతాపతిరావు, సీపీఓ ప్రేమ్చంద్ర, తిరుపతి రెవెన్యూ డివిజనల్ అధికారి రామ్మోహన్, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల నుంచి నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, మండల పరిషత్ అధికారులు పాల్గొన్నారు.
20 నుంచి ఎల్ఎల్ఎమ్ పరీక్షలు
తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలోని లా కళాశాలలో ఎల్ఎల్ఎమ్ తొలి సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 20వ తేదీ నుంచి నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ రాజామాణిక్యం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈ నెల 9వతేదీ లోపు పరీక్షల ఫీజును ఆన్లైన్లో చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
సెలవుల ప్రకటనలోనూ కన్ఫ్యూజనే
తిరుపతి సిటీ: ఎస్వీయూ, టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న డిగ్రీ ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకు ఈనెల 10 నుంచి జూన్ 15వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించారు. తొలుత ఈనెల 1వ తేదీ నుంచి సెలవులు ప్రకటిస్తూ అన్ని కళాశాలలకు ఉత్తర్వులు జారీచేశారు. ఆపై వర్సిటీ అధికారులు మళ్లీ ఆ ఉత్తర్వులను రద్దు చేసి 10వ తేదీ నుంచి సెలవులను ప్రకటిస్తూ మరో ఉత్తర్వులు జారీ చేశారు. అయితే డిగ్రీ 2వ, 4వ సెమిస్టర్ పరీక్షల నేపథ్యంలో ఈనెల 10వ తేదీ నుంచి సెలవులు ప్రకటించినట్లు తెలుస్తోంది. అయితే అధికారుల నిర్లక్ష్యంతో వాయిదా పడిన పరీక్షలను మాత్రం ఈనెల 12, 14, 15 తేదీలలో జరపనున్నట్లు అధికారులు వెల్లడించారు. సెలవుల ప్రకటనలోనూ అధికారులు విద్యార్థులను కన్ఫ్యూజన్కు గురిచేస్తున్నట్టు పలువురు విమర్శలు ఎక్కుపెడుతున్నారు.

తెల్లరాయి దొంగలపై చర్యలేవి?