
వంచించడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య
● ఏడాది పాలనలో ఒక్క హామీ అమలు చేయని కూటమి ప్రభుత్వం ● వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారు ● కూటమి అరాచకాలు, అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు ● 4న వెన్నుపోటు దినంగా నామకరణం ● నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం ● పోస్టర్ ఆవిష్కరణలో భూమన కరుణాకరరెడ్డి
తిరుపతి మంగళం : వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ చంద్రబాబు అని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ధ్వజమెత్తారు. తిరుపతి పద్మావతిపురంలోని తన నివాసం వద్ద శనివారం పార్టీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీషతో కలిసి జూన్ 4వ తేదీ నిర్వహించనున్న వెన్నుపోటు దినానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం భూమన మాట్లాడుతూ ఎలాగైనా అధికారంలోకి రావాలన్న దురుద్దేశంతో ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ప్రజలను నమ్మించి, అబద్ధపు హామీలిచ్చి వంచించడం చంద్రబాబుకు వెన్నతోపెట్టిన విద్య అన్నారు. గత ఎన్నికల్లో కూడా చంద్రబాబు, పవన్కళ్యాణ్ నోటికొచ్చిన అబద్ధాలు చెప్పి సూపర్సిక్స్ హామీలు అంటూ ఏడాది అవుతున్నా ఏ ఒక్క హామీని నెరవేర్చని ప్రజాద్రోహులన్నారు.
రాష్ట్రానికే ఆదర్శం కావాలి
తిరుపతిలో నిర్వహించే నిరసన కార్యక్రమం రాష్ట్రానికే ఆదర్శంగా ఉండేలా విజయవంతం చేద్దామని భూమన పిలుపునిచ్చారు. పార్టీ నగర అధ్యక్షులు మల్లం రవిచంద్రారెడ్డి, టౌన్బ్యాంక్ చైర్మన్ కేతం జయచంద్రారెడ్డి, వైస్ చైర్మన్ వాసుయాదవ్, పార్టీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు గీతాయాదవ్, కార్పొరేటర్లు రామస్వామి వెంకటేశ్వర్లు, ఆదిలక్ష్మి, పార్టీ నాయకులు వెంకటరెడ్డి, సాకం ప్రభాకర్, నల్లాని బాబు, తలారి రాజేంద్ర, కట్టా గోపీయాదవ్, కడపగుంట అమరనాథ్ధ్రెడ్డి, ఉదయ్వంశీ, దినేష్రాయ ల్, షేక్ ఇమ్రాన్బాషా, రాపూరి ప్రసాద్, చింతా రమే ష్, అనిల్రెడ్డి, రాజేష్, పసుపులేటి సురేష్, మల్లం రవి, సాయికుమారి, పుణీత, పుష్పలత పాల్గొన్నారు.
వెన్నుపోటు దినాన్ని విజయవంతం చేయండి
వైఎస్సార్సీపీ నేతలే టార్గెట్
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేసుకుని వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ జైళ్లకు పంపడమే పనిగా పెట్టుకున్నారని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది పాలనలో సుమారు 800 మందికిపైగా తమ నాయకులపై దాడులు చేశార ని, అందులో 370 మందికి పైగా చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కూటమి అరాచకాలు, అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు, పవన్కళ్యాణ్ పాలనపై ఇప్పటికే ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారని, వారే తగిన బుద్ధి చెబుతారని తెలిపారు.
చంద్రబాబు రాజకీయ జీవితమంతా దోచుకోవడం, దాచుకోవడం తప్ప ప్రజలకు వరగబెట్టిందేమీ లేదన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు కూటమి ప్రభుత్వం ప్రజలను వంచించి అధికారంలోకి వచ్చిన జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినంగా నామకరణం చేసినట్టు వెల్లడించారు. జూన్ 4వ తేదీన తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసి కలెక్టర్కు వినతిపత్రాలు సమర్పించనున్నట్టు వెల్లడించారు.