కార్యకర్తలను వేధిస్తే ఊరుకోం | - | Sakshi
Sakshi News home page

కార్యకర్తలను వేధిస్తే ఊరుకోం

Jun 8 2025 1:00 AM | Updated on Jun 8 2025 1:00 AM

కార్యకర్తలను వేధిస్తే ఊరుకోం

కార్యకర్తలను వేధిస్తే ఊరుకోం

● టీడీపీ నేతలా వ్యవహరిస్తున్న సీఐ ● పసుపు చొక్కా వేసుకోండంటూ సీఐపై మండిపాటు ● తిరుపతి రూరల్‌ సీఐపై చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఆగ్రహం ● బాధితులతో కలిసి డీఎస్పీకి ఫిర్యాదు

తిరుపతి రూరల్‌ : తిరుపతి రూరల్‌ మండలం లింగేశ్వరనగర్‌ పంచాయతీలో జరిగిన వివాదంపై శనివారం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి బాధితులతో కలిసి సీఐ చిన్నగోవిందుతో పాటు గొడవలకు కారణమైన వారందరిపై చర్యలు తీసుకోవాలని చంద్రగిరి డీఎస్పీ ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. తిరుపతి రూరల్‌ మండలం లింగేశ్వరనగర్‌ పంచాయతీ సర్పంచ్‌ ముసుకు కోటేశ్వరరావు జన్మదినం సందర్భంగా తన ఇంటి వద్ద శుక్రవారం రాత్రి జన్మదిన వేడుకలు జరుపుకుంటుండగా స్థానిక టీడీపీ మహిళా నేత హేమలత, ఆమె కుమారుడు చిట్టి.. సర్పంచ్‌ ప్లెక్సీలను చించివేశారు. దీంతో తమ ప్లెక్సీలు ఎందుకు చింపుతున్నారని అడిగిన సర్పంచ్‌ కోటేశ్వరరావుతో పాటు అతని భార్య ముని పుష్పపై దాడి చేశారన్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వివాదం చోటు చేసుకుందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎక్కడైనా పల్లెల్లో ఏదైనా గొడవ జరిగితే పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పి శాంతియుత పద్ధతిలో అణచివేస్తారన్నారు. కానీ తిరుపతి రూరల్‌ సీఐ చిన్న గోవిందు మాత్రం గొడవలకు గల కారణాలు తెలుసుకోకుండా సర్పంచ్‌ ఇంటికి బర్త్‌డే పార్టీకి వచ్చిన గ్రామస్తుల అందరిపై లాఠీ చార్జి చేయడం, అక్కడ టీడీపీ ప్లెక్సీలు అలాగే ఉండగా, వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీలను బలవంతంగా తాను సీఐ అన్న విషయం మరిచి ఆయనే చించివేయడం, తన సిబ్బంది చేత చించివేయించడం వంటి పనులు చేశారన్నారు. అలా చేయడం పోలీసులకు తగదని, ఖాకీ చొక్కా వేసుకుని అలాంటి పనులు చేయడం కంటే పసుపు చొక్కా వేసుకుని చేస్తే బాగుంటుందని మోహిత్‌రెడ్డి హితువు పలికారు.

పోలీస్‌ స్టేషన్‌లోనూ కవ్వింపు చర్యలు

తిరుపతి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌కు బాధితులతో కలసి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి శనివారం మధ్యాహ్నం 12 గంటలకు డీఎస్పీని కలవడానికి వస్తారని తెలుసుకున్న సీఐ చిన్నగోవిందు ముందుగానే టీడీపీకి చెందిన వర్గీయులను అక్కడకు పిలిపించుకున్నట్లు బాధిత వర్గాలు చెబుతున్నాయి. పెద్ద ఎత్తున వైఎస్సార్‌సీపీ శ్రేణులు అక్కడకు చేరుకోవడంతో లింగేశ్వర నగర్‌కు చెందిన టీడీపీ వర్గీయులు పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలోనే పోలీసులు చూస్తుండగానే బూతులు తిడుతూ వారిని రెచ్చగొట్టేలా వ్యవహరించారన్నారు. అనంతరం సీఐ చిన్నగోవిందు చర్యలను తప్పుబడుతూ కొంత సేపు నిరసన వ్యక్తం చేసి వెళ్లారు.

సీఐ ఏకపక్ష ధోరణి

గతంలో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి టీడీపీ వాళ్లపై ఫిర్యాదులు తీసుకోకుండా సీఐ ఏకపక్షంగా వ్యవహరించారని మోహిత్‌రెడ్డి ఆరోపించారు. ఇటీవల వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్త ఒకరు ఏదో పోస్టు పెట్టారని అతడిపై కక్ష గట్టి స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడి చేయడంతో అక్రమంగా అరెస్టు చేసి 14 రోజుల రిమాండ్‌కు పంపించారన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలనే టార్గెట్‌గా పెట్టుకుని వేధింపులకు దిగుతున్న సీఐపై న్యాయ పోరాటం చేస్తామని, అంతకంటే ముందు ఆయన పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. తమ ఫిర్యాదుపై పోలీసు అధికారులు చర్యలు తీసుకోకపోతే న్యాయస్థానంలో ప్రైవేటు కేసులు వేస్తామన్నారు. లింగేశ్వరనగర్‌ పంచాయతీలో తిరుపతి రూరల్‌ సీఐ చిన్నగోవిందు చేసిన అరాచకం వీడియోలను కోర్టు ముందు పెట్టి కచ్చితంగా ఆయనపై కేసులు నమోదయ్యేలా చూస్తామని, అంతకంటే ముందుగా తమ పార్టీ సర్పంచ్‌ ఫ్లెక్సీలు చించివేసి గొడవకు కారకులైన వారందరిపై చట్ట ప్రకారం కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి వెంట పెద్ద ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు పోలీస్‌ స్టేషన్‌ వద్దకు చేరుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement