
మహిళలను వంచించి ముంచేసిన చంద్రబాబు
● ఏడాది గడుస్తున్నా ఊసేలేని సంక్షేమ పథకాలు ● జగనన్న పాలనలో మహిళలకు పెద్దపీట ● బాబుని నమ్మి మోసపోయామంటున్న మహిళలు
తిరుపతి సిటీ:ఎన్నికల సమయంలో చంద్రబాబు అండ్ కో 18 ఏళ్లు పైబడిన కుటుంబంలోని ప్రతి మహిళకూ నెలకు రూ.1,500 అధికారంలోకి వచ్చిన వెంటనే ఆడబిడ్డ నిధి కింద అందిస్తామని ప్రగల్భాలు పలికారు. బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అంటూ ఊరువాడా ఊదరగొట్టారు. సూపర్సిక్స్ అమలు చేసి తీరుతామని మహిళలను ఆ పార్టీవైపు తిప్పుకున్నారు. నమ్మి ఓటేసిన మహిళలను నిలువునా ముంచేశారు. అధికారం చేపట్టి ఏడాది కావస్తున్నా కనీసం ఒక్క సంక్షేమ పథకం కూడా ఇవ్వకుండా నాన్చుతున్నారు. కడపలో జరిగిన మహానాడు వేదికగానైనా పథకాల అమలుపై ప్రకటన చేస్తారని జిల్లా మహిళలు ఎదురు చూశారు. కానీ ఆ ఊసే లేదు. మళ్లీ చంద్రబాబు మోసం చేశారంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉచిత బస్సు, తల్లికి వందనం పథకాలను ఊరిస్తున్నారు తప్ప అమలు చేసిన పాపాన పోలేదు. జిల్లాలో 9 లక్షల మంది మహిళలకు ఏడాదిగా బాబు సర్కార్ కుచ్చుటోపీ పెట్టింది.
మహిళలను మహరాణులు చేసిన జగనన్న పథకాలు
జిల్లాలోని ప్రతి మహిళా జగనన్న ప్రవేశ పెట్టిన పథకాల ద్వారా లబ్ధిపొందారు. నవరత్నాలు జిల్లాలోని ప్రతి కుటుంబానికీ వలంటీర్ల ద్వారా అందించారు. ప్రధానంగా సెల్ఫ్ హెల్ఫ్ గ్రూప్లోని సుమారు 3.36 లక్షల మందికి వడ్డీ రీయింబర్స్మెంట్తో కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చారు. జిల్లాలోని పేదకాపు సామాజికవర్గానికి చెందిన మహిళలకు ఏడాదికి రూ.15వేల చొప్పున నాలుగేళ్లపాటు 1.21లక్షల మందికి రూ.726 కోట్లు జమచేశారు. ఈబీసీ నేత్తం కింద రూ.15 వేలు చొప్పున నాలుగేళ్లపాటు అందించారు. చిరువ్యాపారులకు లక్ష మందికి రూ.391 కోట్లు రుణ సహాయం చేశారు. బడుగు, బలహీన మహిళలకు 1.21లక్షల మందికి ఏడాదికి రూ.18,750 చొప్పున నాలుగేళ్లపాటు అందించి ఆదుకున్నారు. జగనన్న చేదోడు పథకం కింద ఏడాదికి రూ.10వేల చొప్పున అందించారు. జిల్లాలో 2.57లక్షల పేద మహిళలకు 2 సెంట్లు చొప్పున ఇంటి స్థలం మంజూరు చేసి ఇళ్లు నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫా పేరుతో అర్హులైన ప్రతి కుటుంబానికీ లబ్ధి చేకూర్చారు. ఏడాదికి రూ.14 వేలు పిల్లల చదువుల కోసం అమ్మఒడి కింద మహిళల ఖాతాల్లో జమచేశారు. వసతి దీవెన, విద్యా దీవెన సైతం తల్లిఖాతాలలో జమచేసి పేద మహిళల గుండెల్లో దేవుడుగా వెలుగొందారు.
ఎన్నికల సందర్భంగా చంద్రబాబు అలవిగాని హామీలు గుప్పించారు. అధికారం చేపట్టిన వెంటనే మహిళాభ్యున్నతికి పెద్దపీట వేస్తామంటూ ఊదరగొట్టారు. ఉచిత బస్సు, డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాలు రూ.3 లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచుతామంటూ జబ్బలు చరిచారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తామంటూ ప్రలోభపెట్టారు. అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, ఉద్యోగాలు చేసే మహిళలకు హాస్టల్ వసతి, విద్యార్థినులకు ‘కలలకు రెక్కలు’ పథకం ద్వారా రుణాలంటూ రెచ్చగొట్టారు. పండుగ కానుకలు, పెళ్లి కానుకలంటూ ఊరించి ఉసూరుమనిపించారు. అధికారం చేపట్టి ఏడాది గడుస్తు న్నా ఇంతవరకు ఏ ఒక్క పథకాన్నీ అమ లు చేయక నట్టేట ముంచేశారని మహిళలు ఆవేదన చెందుతున్నారు.

మహిళలను వంచించి ముంచేసిన చంద్రబాబు

మహిళలను వంచించి ముంచేసిన చంద్రబాబు

మహిళలను వంచించి ముంచేసిన చంద్రబాబు

మహిళలను వంచించి ముంచేసిన చంద్రబాబు