
క్రేజ్ లేని పీజీ
● పోస్టు గ్రాడ్యుయేషన్పై విద్యార్థుల నిరాసక్తత ● గత ఏడాది కంటే 6 వేలు తక్కువగా దరఖాస్తులు ● భారీగా పడిపోతున్న సాధారణ డిగ్రీలో ప్రవేశాలు ● యూజీ పూర్తి చేసిన వెంటనే ఉపాధి వైపు చూస్తున్న యువత
తిరుపతి సిటీ : పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే పెద్ద చదువుగా భావించేవారు. పీజీ చేసిన వ్యక్తికి సమాజంలో ప్రత్యేక గౌరవం ఉండేది. అత్యున్నత విద్యగా గుర్తింపు పొందిన పీజీకి ప్రస్తుతం ఆదరణ కరువవుతోంది. ఎంఏ, ఎమ్కాం, ఎమ్మెస్సీ తదితర కోర్సులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏటా తగ్గుముఖం పడుతున్నారు. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు బీటెక్, ఎంబీబీఎస్ వంటి ప్రొఫెషనల్ కోర్సులపై మొగ్గు చూపుతున్నారు. దీంతో సాధారణ బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలు తగ్గుతున్నాయని అధ్యాపకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే పీజీ కోర్సులకు ఆదరణ తగ్గుతోందని వెల్లడిస్తున్నారు.
తగ్గిన దరఖాస్తులు
గత ఏడాది పీజీ సెట్కు 32 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఈ ఏడాది 6 వేలు తగ్గడం గమనార్హం. 31 సబ్జెక్టులకు సంబంధించి పీజీలో సుమారు 25 వేల సీట్లు ఉండగా 25,688 దరఖాస్తులు రావడంతో పీజీ కోర్సులలో ప్రస్తుతం ఉన్న సీట్లకు అందిన దరఖాస్తులతో పోలిస్తే పోటీ 1:1గా ఉంటుందనడంలో సందేహంలేదు. ఈ ఏడాది పీజీకి దరఖాస్తు చేసుకుని అర్హత సాధించిన ప్రతి విద్యార్థికి సీటు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రెండేళ్లు వచ్చిన దరఖాస్తుల వివరాలు
కోర్సులు పీజీసెట్–2024 పీజీసెట్–2025
కెమికల్ సైన్స్ 8,551 6,070
లైఫ్ సైన్స్ 3,753 4,027
కంప్యూటర్ 2,975 2,333
కామర్స్ 2,215 1,438
ఇంగ్లిష్ 1,127 898
హ్యుమానిటీస్ 1,575 883
జువాలజీ 1,875 1,548
గణితం 2,200 1,175
ఫిజిక్స్ 1,495 938
బోటనీ 1,370 1,295
మిగిలినవి 6,013 5,083
ఉపాధి వైపు యువత మొగ్గు
ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల వైపు అధికంగా ఆసక్తి చూపుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం యూజీ పూర్తి చేసిన వెంటనే ఉద్యోగం వైపు ఎక్కువగా మొగ్గుతున్నారు.
– భూపతినాయుడు, రిజిస్ట్రార్, ఎస్వీయూ

క్రేజ్ లేని పీజీ