
నకిలీ పత్రాలతో ఆస్తులు అమ్మేసిన వ్యక్తి అరెస్ట్
తిరుపతి రూరల్: నకిలీ పత్రాలు సృష్టించి విలువైన ఆస్తులు కాజేసి ఇతరులకు అమ్మేసిన వ్యక్తిని తిరుపతి రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ చిన్న గోవిందు కథనం మేరకు.. తిరుపతి రూరల్ మండల పరిధిలోని శ్రీనివాస హౌసింగ్ సొసైటీలో శారద అనే మహిళకు చెందిన ఆస్తిని చంద్రగిరి మండలం గంగుడుపల్లెకు చెందిన మునిరత్నంరెడ్డి మరో ఇద్దరితో కలిసి రూ.86 లక్షలకు విక్రయించాడు.అలాగే వేదిక్ అపార్ట్మెంట్లో ఒక సారి అమ్మిన స్థలాన్ని మరొకరికి కట్టబెట్టి అక్రమంగా సొమ్ము చేసుకున్నాడు. రాజ కుమారి అనే మహిళకు సంబంధించిన ఆస్తిని తన భార్యపై రిజిస్టర్ చేసుకుని వేరొకరికి అమ్మేశాడు. ఇలా ఎంతో మంది భూములకు నకిలీ పత్రాలతో విక్రయించినట్లు పోలీసులకు వరుస ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు చేసిన పోలీసులు మునిరత్నం రెడ్డిని ఆదివారం మల్లవరం క్రాస్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. చైన్నెలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న నిందితుడి నుంచి పలు డాక్యుమెంట్లు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
ఘాట్ రోడ్లో ప్రమాదం
తిరుమల: తిరుమల మొదటి ఘాట్ రోడ్లో ఆదివారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు స్వల్పంగా గాయపడిన ఘటన వెలుగు చూసింది. తమిళనాడుకు చెందిన భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకుని వాహనంలో తిరిగి వెళ్తుండగా నాలుగో మలుపు వద్ద డ్రైవర్ వాహనాన్ని అదుపు చేయలేక డివైడర్ను ఢీకొట్టాడు. ప్రమాదంలో ఇద్దరు భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని తిరుమ లలోని అశ్విని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గురైన వాహనాన్ని టీటీడీ ట్రాఫిక్ పోలీసులు సకాలంలో పక్కకు తొలగించి రాకపోకలను క్రమబద్ధీకరించారు.