
గరుడునిపై నృసింహుని విహారం
రాపూరు : పెంచలకోనలోని పెనుశిల శ్రీలక్ష్మీనరసింహాస్వామివారు చందనాలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆదివారం స్వాతి నక్షత్రం శ్రీవారి జన్మనరక్షత్రం కావడంతో మూల మూర్తిని చందనంతో అలంకరించారు. ఉదయం అభిషేకం, పుష్పాలంకరణ, శాంతి హోమం జరిపించారు. అనంతరం కనులపండువగా కల్యాణోత్సవం నిర్వహించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేపట్టారు. రాత్రి శ్రీవారు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన గరుడ వాహనం అధిష్టించి మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు.
23న ఒలింపిక్ రన్
తిరుపతి కల్చరల్ : జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 23వ తేదీన ఒలింపిక్ రన్ నిర్వహించనున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి శ్రీధర్ తెలిపారు. ఆదివారం తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఉపాధ్యక్షుడు ప్రసన్నకుమార్ మాట్లాడుతూ త్వరలో స్పోర్ట్స్ స్కూల్ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. . అనంతరం 40 ఏళ్లుగా క్రీడలకు సేవలందిస్తున్న ప్రసన్నకుమార్ని పలు క్రీడా సంఘాల ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఎలమంచిలి ప్రవీణ్, కోశాధికారి సాయికుమార్, ఉపాధ్యక్షుడు శివప్రసాద్, సహ కార్యదర్శి విజయ్కుమార్, రత్నాకర్, తైక్వాండో సంఘం నేత గోపీనాయుడు, బ్యాడ్మింటన్ సంఘం నేత శివయ్య, రాకెట్ బాల్ సంఘం నేత ప్రేమ్, రోయింగ్ సంఘం శ్రీధర్, రైఫిల్ రోయింగ్ సంఘం హిమత్ పాల్గొన్నారు.
టీటీడీ కాలేజీల్లో పేద విద్యార్థులకు దగా
తిరుపతి కల్చరల్ : టీటీడీ జూనియర్ కళాశాలల్లో పేద విద్యార్థులను దగా చేస్తున్నారని, ఈడబ్ల్యూఎస్ పేరుతో అగ్రవర్ణాల వారికి పెద్దపీట వేస్తున్నారని ఓబీసీ విద్యార్థుల సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు నాగేశ్వరరావు ఆరోపించారు. ఆదివారం ప్రెస్క్లబ్లో ఆయన మాట్లాడారు. తిరుపతి నగరంలో టీటీడీ నిర్వహిస్తున్న ఎస్వీ జూనియర్ కళాశాల, శ్రీపద్మావతి మహిళా జూనియర్ కళాశాలలో అడ్మిషన్కు పెద్దసంఖ్యలో బీసీ, ఎస్సీ,ఎస్టీ విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. అయితే ఈడబ్ల్యూఎస్ కింద తక్కువ మార్కులు వచ్చిన ఓసీ విద్యార్థులకు సీట్లు కేటాయించారని మండిపడ్డారు. ఎక్కువ మార్కులు సాధించిన పేద విద్యార్థులకు సీట్లు దక్కకలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 330 మార్కులు సాధించిన ఓసీ విద్యార్థినికి పద్మావతి మహిళా కళాశాలలో సీటు లభించిందని, అయితే ఎస్టీ విద్యార్థినికి 530 మార్కులు వచ్చినా తిరస్కారమే ఎదురైందన్నారు. పేద విద్యార్థులకు అన్యాయం చేస్తున్న ఈడబ్ల్యూఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సంఘం నేతలు విజయ్ ఉత్తరాది, వెంకటేష్, సంభరం పాల్గొన్నారు.

గరుడునిపై నృసింహుని విహారం

గరుడునిపై నృసింహుని విహారం