
ఎన్నికల సమయంలో ఓట్ల కోసం గారడీ
● పీఠం ఎక్కిన తర్వాత బురిడీ ● యువతీయువకులను మోసం చేసిన చంద్రబాబు ● ఏటా 4లక్షల ఉద్యోగాలు.. జాబ్ క్యాలెండర్ అంటూ వంచన ● నిరుద్యోగ భృతి పేరిట శఠగోపం ● అయోమయంలో ఆప్కాస్ సిబ్బంది భవితవ్యం ● రద్దు చేసే దిశంగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం ● కలగానే ఒకటో తేదీన వేతనం ● కూటమి సర్కార్ వైఖరిపై మండిపడుతున్న జనం ● గత వైఎస్సార్సీపీ హయాంలో 2.25 లక్షల మందికి ఉద్యోగావకాశం ● జగనన్న పాలనలో ఉపాధి కల్పనే లక్ష్యం
వేతన జీవుల వెతలు
ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తారీఖున వేతనాలు జమ చేస్తామని బాబు చెప్పిన మాటలు నమ్మి వేతన జీవులు మోస పోయారు. జిల్లాలో సుమారు 85వేల మంది శాశ్వత, తాత్కాలిక ఉద్యోగులు సకాలంలో జీతం అందక ప్రతి నెలా నరకం అనుభవిస్తున్నారు. ఏడాదిగా ఏనాడూ ఒకటో తేదీన జీతం జమకాకపోవడంతో ఈఎంఐలు, లోన్లు, వడ్డీలు, నిత్యావసర సరుకులకు నానా అవస్థలు పడుతున్నారు. అప్పులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
తిరుపతి సిటీ : యువతకు ఏడాదికి 4లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. అధికారం చేపట్టిన తొలి ఏడాది నుంచి జనవరి ఒకటో తారీఖున జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3వేల భృతి అందిస్తాం. పారిశ్రామిక రంగాన్ని కొత్తపుంతలు తొక్కించి యువతకు ఉపాధి కల్పించి తీరుతాం అంటూ సార్వత్రిక ఎన్నికలలో చంద్రబాబు అండ్ కో ప్రగల్భాలు పలికారు. యువతను మభ్యపెట్టి ఓట్లు దండుకున్నారు. అధికారం చేపట్టి ఏడాది గడుస్తున్న ఒక్క ఉద్యోగం లేదు. జాబ్ క్యాలెండర్ ఊసేలేదు. నిరుద్యోగ భృతి ఇవ్వలేమంటూ చేతులెత్తేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా యూటర్న్ తీసుకున్న కూటమి సర్కార్ను చూసి మోస పోయామంటూ యువత ఆవేదన వ్యక్తం చేస్తోంది. అలాగే ఉద్యోగాల కల్పన మాట దేవుడెరుగు ఉన్నవాటిని తొలగించి చిరుద్యోగులను రోడ్డుపాలు చేస్తున్నారు. ఆప్కాస్ను పూర్తిగా రద్దు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
గాలం వేసి..నామం
ఎన్నికలలో యువతకు గాలం వేసి ఓట్లు దండుకునేందుకు యువగళం పేరుతో పాదయాత్ర ప్రారంభించిన లోకేష్ ఊరు వాడా తిరుగుతూ అబద్ధపు మాటలతో ముఖాముఖి పేరుతో సభలు నిర్వహించారు. ప్రతి ఇంటిలో ఒక పారిశ్రామిక వేత్తను తయారు చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగాలను ఏటా భర్తీ చేస్తాం. ఏడాదికి 4లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి తీరుతాం. నిరుద్యోగ భృతిని అందిస్తామని ఊదరగొట్టారు. అధికారం చేపట్టి విద్యాశాఖ మంత్రిగా తనకు మాత్రమే ఉపాధి కల్పించుకుని నిరుద్యోగులకు శఠగోపం పెట్టేశారు. 2024 జూన్ నుంచి ఏడాదిగా ఒక్క ఉద్యోగాన్ని భర్తీ చేయలేని అసమర్థ ప్రభుత్వంగా పేరుపొందింది.
ఆప్కాస్ రద్దు దిశగా అడుగులు
జిల్లాలో తాత్కాలిక ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. కూటమి ప్రభుత్వం ఏడాదిగా ఆప్కాస్ ఉద్యోగులపై కక్ష పెంచుకుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15వేల మందిని తొలగించింది. అంతటితో ఆగకుండా జగనన్న పాలనలో ఏర్పాటు చేసిన ఆప్కాస్నే పూర్తిగా రద్దు చేసేందుకు అడుగులు వేస్తోంది. దీంతో జిల్లాలో సుమారు 30వేల మంది తాత్కాలిక ఉద్యోగులు వీధిన పడనున్నారు. ప్రస్తుతం ఉన్న తాత్కాలిక ఉద్యోగులకు టైం స్కేల్ అందిస్తూ పీఎఫ్ను వర్తింపజేస్తామని హామీ చెప్పిన కూటమి సర్కార్ చేతులెత్తేసింది. జీతభత్యాలు సైతం సక్రమంగా అందిచకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. త్వరలో ఆప్కాస్ను రద్దు చేసేందుకు పావులు కదుపుతోంది. దీంతో ఆప్కాస్ ఉద్యోగులు ఆందోళనకు సిద్దమవుతున్నారు.
భృతి అంతా భ్రాంతి
కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో యువతకు చేసింది శూన్యం. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలలో కలిపి ఖాళీగా ఉన్న సుమారు 98వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న హామీ తుంగలో తొక్కేసింది. డిగ్రీ, పీజీ పూర్తి చేసిన యువతకు అదే ఏడాదిలో ఉద్యోగం కల్పించేందుకు పారిశ్రామికాభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని గాలికి వదిలేసింది. నిరుద్యోగ భృతి కోసం పడిగాపులు కాస్తున్న యువతకు చివరకు భ్రాంతినే మిగిల్చింది. సూపర్ సిక్స్ పేరుతో చేసిన వంచననే మళ్లీ యువత విషయంలో పునరావృతం చేసింది.
బకాయితో పాటు చెల్లించాలి
యువగళంలో లోకేష్ ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగులకు నెలకు రూ.3వేల భృతి చెల్లించాలి. గత ఏడాదిగా కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఊసే ఎత్తడం లేదు. ఇప్పటి వరకు 12నెలలకు గాను ఒక్కో నిరుద్యోగికి రూ. 36వేలు చెల్లించాల్సి ఉంది. ఏడాదికి 4లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని యువతకు హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. తూతూ మంత్రంగా మెగా డీఎస్సీ అంటూ హంగామా చేస్తున్నారు. – రవిశంకర్రెడ్డి, ఎంబీఏ, తిరుపతి
జాబ్ క్యాలెండర్ ఊసే లేదు
ఎన్నికల హామీలలో భాగంగా కూటమి నేతలు యువతను ఆకట్టుకుంటూ పథకాలను అమలు చేస్తా మని మేనిఫెస్టోలో పెట్టా రు. కానీ సూపర్సిక్స్ హామీ ల్లో ఒక్కటీ అమలు కాలేదు. కనీసం యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ప్రతి ఏడాది జనవరి ఒకటో తారీఖున జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. ఆ ఊసే ఎత్తడం లేదు. యువతను కూటమి సర్కార్ వంచించింది. వైఎస్సార్సీపీ పాలనలో తొలి ఏడాదిలోనే 2.25లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశారు. అందులో మా అక్కకు సైతం ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం నిరుద్యోగుల పరిస్థితి దారుణంగా ఉంది.
– సుకన్య, ప్రైవేటు ఉద్యోగి, తిరుపతి రూరల్
ఉద్యోగాలు ఎక్కడ?
తమను గెలిపిస్తే ఏడాదికి 4 లక్షలు ఉద్యోగాల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చంద్రబాబు యువతను నమ్మించాడు. ఈ ఏడాది కాలంలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. గత ప్రభుత్వం నిరుద్యోగ యువతను దృష్టిలో ఉంచుకొని 6.47 లక్షల ఉద్యోగాలు ఇస్తే అందులో 2.25 లక్షల శాశ్వత ఉద్యోగాలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వంలో ఉన్నవాటిని తీసేస్తున్నారు. ఉద్యోగులకు భద్రత కరువైంది. ఉద్యోగం ఇచ్చే వరకు రూ.3వేల భృతి ఇస్తామన్న బాబు 12 నెలలు గడిచినా ఆ మాటే మరిచారు.
– కదిరి రాజేంద్ర, తిరుపతి
ఇది దగా ప్రభుత్వం
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయినా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం బాధాకరం. యువతకు జాబ్ క్యాలెండర్ లేదు. నిరుద్యోగ భృతి లేదు. సుమారు లక్ష మంది పని చేస్తున్న ఆప్కాస్ను ఎత్తేస్తున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడడం దారుణమైన విషయం. కూటమి ప్రభుత్వం కాదు ఇది యువత పాలిట దగా ప్రభుత్వం. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలి.
– పి.శరత్చంద్ర, మణిపిరెడ్డిపల్లె,
పాకాల మండలం
కక్ష గట్టింది
కూటమి ప్రభుత్వం ఆప్కాస్ ఉద్యోగులపై కక్ష గట్టింది. వేధింపులకు పాల్పడుతూ తొలగించే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వం ఇలా చిరుద్యోగులపై కత్తిగట్టడం దారుణం. టైమ్ స్కేల్ ఉద్యోగులుగా గుర్తిస్తూ పీఎఫ్ సైతం వర్తింపజేస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీ ఇచ్చారు. ఇప్పుడు పూర్తిగా రద్దు చేసేందుకు కుట్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తొలగించే ప్రయత్నం చేస్తే ప్రతిఘటిస్తాం. పోరు బాట పట్టి సర్కారు మెడలు వంచుతాం. – జి.చిన్న బాబు,
ఆప్కాస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు
చిరుద్యోగులపై ప్రతాపమా?
గత 25ఏళ్లుగా ప్రభుత్వ సంస్థలలో చాకిరీ చేస్తున్న చిరుద్యోగులపై కూటమి ప్రభుత్వం ప్రతాపం చూపడం సరికాదు. ఆప్కాస్ను తొలగిస్తామనడం దారుణం. చాలీచాలని జీతాలతో కుటుంబాలను నెనెట్టుకొస్తున్న తాత్కాలిక ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించేందుకు కృషి చేస్తుందని భావించాం. ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఊహించలేదు. టైంస్కేల్ ఉద్యోగులుగా గుర్తించకపోతే ఉద్యమిస్తాం. – పి.బాబు,
జేఏసీ జిల్లా వైస్ ప్రెసిడెంట్
వైఎస్సార్సీపీ పాలనలో స్వర్ణయుగం
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం యువతకు ఉపాధి, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేసింది. అర్హులైన వారికి ప్రత్యేక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లను ఏర్పాటు చేసి శిక్షణ ఇప్పించింది. ఈ క్రమంలో వేలాది మంది ఉన్నత స్థాయి ఉద్యోగాలు దక్కించుకున్నారు. అలాగే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన 3 నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 2.25లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశారు. అన్ని శాఖలలోనూ పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులను ఆప్కాస్ కిందకి తెస్తూ ఉద్యోగ భద్రత కల్పించారు. ఔత్సాహిక యువతను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాలలో పెద్ద సంఖ్యలో జాబ్ మేళాలు నిర్వహించి తొలి ఏడాదిలోనే సుమారు 1.24లక్షల ఉద్యోగాలను యువతకు అందించారు.
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కల్పించిన ఉద్యోగాలు
సచివాలయ సిబ్బంది 5,010
వలంటీర్లు 11,938
ఎండీయూ ఆపరేటర్లు 369
వైన్షాప్ సిబ్బంది 856
విద్యా, వైద్య రంగాల్లో 8,752
ప్రభుత్వ శాఖలలో(శాశ్వత, తాత్కాలిక) 10,257
జాబ్ మేళాల్లో ఉద్యోగాలు పొందిన వారు 33,740

ఎన్నికల సమయంలో ఓట్ల కోసం గారడీ

ఎన్నికల సమయంలో ఓట్ల కోసం గారడీ

ఎన్నికల సమయంలో ఓట్ల కోసం గారడీ

ఎన్నికల సమయంలో ఓట్ల కోసం గారడీ

ఎన్నికల సమయంలో ఓట్ల కోసం గారడీ