
పల్లె వైద్యంపై ‘సమ్మె’ట!
● సీహెచ్ఓల సమ్మెతో స్తంభించిన వైద్యసేవలు ● అవస్థలు పడుతున్న పేదలు
తిరుపతి తుడా: పేదల వైద్యం పట్ల ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. సకాలంలో వైద్యసేవలందకుండా ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేస్తోంది. వైద్య సిబ్బంది న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకుండా మీనమేషాలు లెక్కిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే 108 ఉద్యోగులు, ఆరోగ్యశ్రీ సిబ్బంది, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల యాజమాన్యం ఆందోళన బాట పట్టగా.. తాజాగా శుక్రవారం నుంచి విలేజ్ హెల్త్ క్లినిక్లలో పనిచేసే ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లాల్సి వచ్చింది. మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల నిరవధిక సమ్మెతో పల్లె వైద్యం స్తంభించిపోయింది.
విచ్ఛిన్నం చేయాలనే కుట్ర
గత ప్రభుత్వం విలేజ్ హెల్త్ క్లినిక్లలో 14 రకాల వైద్య సేవలతోపాటు 105 రకాల మందులు అందుబాటులో తెచ్చింది. స్థానికంగానే నాణ్యమైన వైద్యం అందించాలన్న సంకల్పంతో విలేజ్ హెల్త్ క్లినిక్లకు పురుడుపోసింది. ఈ క్లినిక్లలో పటిష్టమైన వైద్య పరికరాలను సమకూర్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పేదలకు అందిస్తున్న వైద్య వ్యవస్థలను సర్వనాశనం చేసింది.
డిమాండ్లు ఇవీ
ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలి
ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23 శాతం వేతన సవరణ జరగాలి
పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్ధీకరించాలి
ఈపీఎఫ్ఓ పునరుద్ధరించాలి
క్లినిక్ల అద్దె బకాయిలను చెల్లించాలి
నిర్ధిష్టమైన జాబ్ చార్ట్ అందించాలి
ఎఫ్ఆర్ఎస్ నుంచి సీహెచ్ఓలను మినహాయించాలి
హెచ్ఆర్ పాలసీ, ఇంక్రిమెంట్లు, బదిలీలు, పితృత్వ సెలవులు అమలు చేయాలి.
గత నెల 28 నుంచి సమ్మె
జీతభత్యాల విషయంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించాలనే ప్రధానమైన డిమాండ్లతో సమ్మెకుదిగాం. తొలుత శాంతియుతంగానే నిరసన చేపట్టాం. ఫలితం లేకపోవడంతో నిరవధిక సమ్మె చేపట్టాం. గత నెల 28వ తేదీ నుంచి సమ్మె కొనసాగుతోంది.
–పీ.పొన్యాన, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్, తిరుపతి జిల్లా
ఇంత నిర్లక్ష్యమా
మారుమూల గ్రామ ప్రజలకు వైద్య సేవలందిస్తున్న మా పట్ల ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్యమేల?. ఎన్హెచ్ఎంలోని ఇతర ఉద్యోగులతో సమానంగా 23 శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలి. ప్రతి నెలా జీతంతో పాటు ఇన్సెంటీవ్ ఇవ్వాలి. ప్రతి సంవత్సరం 5 శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలి.
–సాయి మోహన్, సీహెచ్ఓ, తిరుపతి జిల్లా
డిమాడ్లు పరిష్కరించాల్సిందే
మా న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కరించాలి. సీహెచ్ఓల జీతభత్యాలు ఇవ్వడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ఆరేళ్ల సర్వీసు పూర్తయిన ఎంఎల్ హెచ్ఎపీలను రెగ్యులర్ చేయాలి. జీఓ నంబర్ 64 ప్రకారం ఎన్ హెచ్ఎంలో అన్ని కేడర్ల ఉద్యోగులకు 23 శాతం పీఆర్సీ ఇవ్వాలి. 189 కేడర్లకు ఇచ్చి సీహెచ్ఓలకు ఇవ్వకపోవడం అన్యాయం.
– కవిత కుమారి, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్, తిరుపతి జిల్లా

పల్లె వైద్యంపై ‘సమ్మె’ట!

పల్లె వైద్యంపై ‘సమ్మె’ట!

పల్లె వైద్యంపై ‘సమ్మె’ట!