చిల్లకూరు: టీచర్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఓ విద్యార్థిని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు పాఠశాలకు వచ్చి సదరు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. ఈ ఘటన చిల్లకూరు మండలం తిక్కవరం జెడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. తిక్కవరం జెడ్పీ ఉన్నత పాఠశాలలో బయాలజీ ఉపాధ్యాయుడు మధుబాబు కొంత కాలంగా తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులకు విషయం తెలియజేసింది. ఆ విద్యార్థిని తల్లిదండ్రులు మంగళవారం పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడ్ని చితక బాదారు. దీంతో పాఠశాలలో సహచర ఉపాధ్యాయులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయుడ్ని స్టేషన్కు తరలించి, విచారణ చేపడుతున్నారు. జిల్లా ఉప విద్యాశాఖాధికారి పాఠశాలకు చేరుకుని విద్యార్థిని తల్లిదండ్రులతోపాటు, ఉపాధ్యాయులు, విద్యార్థులను విచారణ జరిపి, నివేదికను జిల్లా విద్యాశాఖాధికారికి అందజేశారు. ఈ విషయమై ఉప విద్యాశాఖాధికారి సనత్కుమార్ మాట్లాడుతూ బయాలజీ ఉపాధ్యాయుడు విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించేవాడని నిర్ధారణ అయ్యిందని, దీంతో అతనిపై జిల్లా అధికారులు వేటు వేసే అవకాశం ఉందన్నారు. నెల కిందట మండలంలోని ఉడతావారిపాళెంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో కూడా ఇలాగే ఉపాధ్యాయుడు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడని గుర్తుచేశారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కీచక ఉపాధ్యాయుడిపై ఫోక్సో కేసు నమోదు చేసినట్టు చిల్లకూరు ఎస్సై సురేష్బాబు తెలిపారు.
స్కూల్ అసిస్టెంట్ సస్పెండ్
తిరుపతి ఎడ్యుకేషన్ : చిల్లకూరు మండలం, తిక్కవరం జెడ్పీ హైస్కూల్లో విధులు నిర్వహిస్తున్న స్కూల్ అసిస్టెంట్ను సస్పెండ్ చేసినట్లు డీఈఓ కేవీఎన్.కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆ పాఠశాలలో బయాలజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు బీ.మధుబాబు తొమ్మిదో తరగతి విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఈ నేపథ్యంలో గూడూరు డీవైఈఓ విచారణ చేపట్టారని, ఆయన ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా ఉపాధ్యాయుడిని విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు డీఈఓ తెలిపారు.
నిర్లక్ష్యం... అవగాహన లోపం..
తిరుపతి తుడా: రుయా ఆసుపత్రి న్యూరాలజీ విభాగంలో చికిత్స పొందుతున్న చిన్న రంగయ్యను కుటుంబ సభ్యులు అవగాహన లోపంతో వైద్యులు రమ్మన్నారని భావించి వార్డు నుంచి ఓబీకి తీసుకువచ్చారు. మంగళవారం ఓపీ ఉండడంతో వార్డులో లేవలేని స్థితిలో చికిత్స పొందుతున్న చిన్న రంగయ్యను వార్డు నుంచి స్ట్రక్చర్ పై తీసుకురావడం ఆస్పత్రిలో నిర్లక్ష్యాన్ని తెలియజేస్తోంది. వార్డు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా రోగిని వార్డు నుంచి తరలించిన నర్సింగ్ స్టాఫ్ వారిని ప్రశ్నించకపోవడం విమర్శలకు తావిస్తోంది. స్ట్రక్చర్ను రోగి సహాయకులే తోసుకుంటూ ఓపీ వద్దకు రాగా వైద్యులు ఇక్కడికి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు.. ఎందుకు వచ్చారని వైద్యులు గట్టిగా చెప్పడంతో తిరిగి రోగిని న్యూరాలజీ వార్డుకు తరలించారు. రోగిని తీసుకువచ్చే క్రమంలో ఎంఎన్ఓ సిబ్బంది లేకపోవడం గమనార్హం.