మెటల్ రోలింగ్ చేస్తున్న రోలర్
చిట్టమూరు: రాజు తలచుకుంటే కొరడా దెబ్బలకు కొదువ లేదన్న నానుడిని పాటిస్తున్నారు కూటమి నేతలు. తమ అధికార బలంతో అధికారులను పక్కదారి పట్టించి, తమకు అనుకూలంగా ప్రభుత్వ నిధులు ఖర్చు చేయిస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. ఇలాంటి సంఘటనే చిట్టమూరు మండలం ఎల్లసిరి గ్రామంలో చోటు చేసుకుంది. ఈ గ్రామానికి సమీపంలో నాలుగు నియోజకవర్గాల్లో పెత్తనం చేస్తున్న కూటమికి చెందిన పెద్దాయన గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనే ఎస్సీ, ఎస్టీల పొలాలతోపాటు ప్రభుత్వ భూములు సుమారు 500 ఎకరాలను తమ అధీనంలోకి తెచ్చుకుని, ఫామ్హౌస్ ఏర్పాటు చేసుకున్నారు. అయితే అక్కడకు వెళ్లేందుకు పూర్తి స్థాయి రోడ్డు సౌకర్యం లేక ఇబ్బంది పడేవారు. ప్రస్తుతం అధికారం చేపట్టిన కూటమి సర్కారు ఇటీవల పల్లె పండుగ పేరు తో రహదారులు నిర్మిస్తుంది. ఇదే మంచి తరుణం అనుకున్న ఆ పెద్దాయన తమ ఫామ్హౌస్కు రూ.15 లక్షలతో మెటల్ రోడ్డు నిర్మాణానికి శ్రీకా రం చుట్టారు. ఇందుకు అధికారులు కూడా జీ హు జూర్ అంటూ తలలు ఊపారు. నిబంధనలు పక్క పెట్టి కూటమి ప్రభుత్వానికి చెందిన పెద్దాయన తోటకు రోడ్డు నిర్మాణం పూర్తి చేయిస్తున్నారు. అయితే ఇదే మండలంలోని బురదగాలి కొత్త పాళేనికి ఇలాంటి రహదారి ఉన్నా, దానినికి మాత్రం అటవీ ఆంక్షలు ఉన్నాయని, కనీసం తట్టడు మట్టి కూడా వేయకుండా ఆ ప్రాంత వాసులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
అటవీ, చెరువు భూముల్లో రోడ్డు నిర్మాణం
చిట్టమూరు మండలంలోని మల్లాం– నాయుడుపేట రహదారికి మధ్యలో ఎల్లసిరి గ్రామానికి రోడ్డు ఉంది. ఈ గ్రామానికి సమీపంలో ఉన్న ఎగువగిరిజనకాలనీ నుంచి అటవీ, చెరువుకు సంబంధించిన భూములున్నాయి. గతంలో రోడ్డు నిర్మాణం చేపట్టే ప్రయత్నం చేసినప్పటికీ ఆంక్షలున్నందున రోడ్డు నిర్మాణం జరగలేదు. అయితే ఇటీవల అటవీ అధికారులు రాక పోకలు సాగించడానికి వీలుగా కాలి బాటలు ఏర్పాటు చేసుకున్నారు. అలాగే అటవీ భూమి ఆక్రమణలకు గురి కాకుండా ఉండేలా ట్రెంచ్ కొట్టారు. దీనిని ఆసరా చేసుకున్న కూటమి ప్రభుత్వంలోని నాయకులు నిబంధనలను తమకు అనుకూలంగా మార్చుకుని, జిల్లాధికారుల ద్వారా రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించుకున్నారు. అంతే చక చకా పనులు పూర్తిచేసేలా కింద స్థాయి అధికారులు పనులు చక్క బెడుతున్నారు. రోడ్డు పనులు ఇంత త్వరగా పూర్తి చేయడంపై మండల ప్రజలు ఆశ్చర్యానికి గురి అవుతున్నారు.
పెద్దలతోటకు రూ.15 లక్షలతో రహదారి
అటవీ, చెరువు ప్రాంతాల్లో రోడ్డు
ఉపాధి నిధులు మంజూరు
పెద్దల తోటకు వేసే రోడ్డుకు ఇటీవల ప్రభుత్వం పల్లె పండుగ పేరుతో ఉపాధి హామీ పథకం ద్వారా నిధులు మళ్లించిన విషయం తెలిసిందే. దీనిని తమకు అనుకూలంగా మార్చుకుని, జిల్లాధికారుల ద్వారా తోటకు రోడ్డు వేసుకునేందుకు ఎల్లసిరి ఎగువ గిరిజన కాలనీని చూపించి, నిధులు మంజూరు చేయించుకున్నారు. ప్రస్తుతం వేస్తున్న రోడ్డు పెద్దలతోట వద్దకు తప్ప ఆ తరువాత కనీసం కాలిబాట కూడా లేకపోవడం విశేషం.
ట్రెంచ్ కొట్టారు
రోడ్డు నిర్మాణం చేసే ప్రాంతం అటవీ ప్రాంతం కాదు. అటవీశాఖాధికారులు ఇప్పటికే ట్రెంచ్ కొట్టి ఉన్నందున అక్కడ వరకే వారి హద్దు మిగిలింది. ప్రభుత్వ భూమి అయినందున రోడ్డు నిర్మాణం చేపట్టాం.
– జగదీష్, ఇన్చార్జి ఏఈ, పీఆర్, చిట్టమూరు
కలెక్టర్ ఆదేశాల మేరకు నిధులు మంజూరు
ఎల్లసిరి ఎగువ గిరిజన కాలని నుంచి వేస్తున్న మెటల్ రోడ్డుకు నిధులు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పల్లె పండుగలో భాగంగా ఉపాధి పథకం నిధులు రూ.15 లక్షలు మంజూరు చేశాం. దీంతో పనులు చేపట్టి పూర్తి చేస్తున్నాం. ఇక్కడ అటవీ భూమి ఉందన్న విషయం తనకు తెలియదు. విచారణ చేస్తాం.
– శ్రీనివాసరావు, డీఈ, పంచాయతీరాజ్
ఎవరి కోసం రోడ్డు నిర్మాణం?