
వెంకన్నా మమ్మల్ని ఆదుకో స్వామి
● శ్రీవారి మెట్టు వద్ద చిరు వ్యాపారుల వేడుకోలు
తిరుపతి కల్చరల్ : న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 216 రోజులుగా దీక్ష చేస్తున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదని చిరు వ్యాపారులు వాపోయారు. వారు ఆదివారం ‘మా సమస్యలు నీవైనా పరిష్కరించు స్వామీ’ అని ఏడు కొండల వాడిని మొక్కుకున్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎస్.జయచంద్ర వ్యాపారులతో కలిసి శ్రీవారి చిత్రపటాన్ని నెత్తిన పెట్టుకొని అలిపిరి పాదాల మండపం వద్ద పూజలు చేశారు. కొబ్బరి కాయలు సమర్పించారు. జయచంద్ర మాట్లాడుతూ శ్రీవారి మెట్టు చిరు వ్యాపారులు సమస్యలు పరిష్కరించాలని దీక్షలు చేస్తున్నా టీటీడీ యాజమాన్యం, కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. వారికి ఏడు నెలల నుంచి ఉపాధి లేదని, కుటుంబాల పోషణ కష్టంగా మారిందని తెలిపారు. టీటీడీ చైర్మన్ బీఆర్.నాయుడు, ఈవో శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి స్పందించి చిరు వ్యాపారుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో శ్రీవారి మెట్టు చిరు వ్యాపారుల యూనియన్ అధ్యక్షుడు చిట్టిబాబు, ప్రధాన కార్యదర్శి మధు, యుగంధర్, చిరంజీవి, రాంబాబు, ప్రకాష్, గోపి, మల్లి, రామమూర్తి, పెంచలయ్య పాల్గొన్నారు.