
మధ్యవర్తిత్వంపై ముగిసిన శిక్షణ
తిరుపతి లీగల్: ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 44 మంది న్యాయవాదులకు మధ్యవర్తిత్వంపై తిరుపతి రాస్ భవనంలో నిర్వహించిన శిక్షణ తరగతులు శుక్రవారంతో ముగిశాయి. ఈ కార్యక్రమానికి ఉమ్మడి చిత్తూరు జిల్లా న్యాయ సేవా సంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి ఎంఎస్ భారతి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర, జిల్లా న్యా య సేవా సంస్థలు, తిరుపతి మండల న్యాయ సేవ అధికార సంస్థ సంయుక్తంగా మధ్యవర్తిత్వంపై న్యాయవాదులకు అవగాహన తరగతులు నిర్వహించినట్టు తెలిపారు. శిక్షణ ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు న్యాయవాది అనుజ సక్సేన, మధ్య ప్రదేశ్ హైకోర్టు న్యాయవాది ఎంఎస్ నినాకరేలను సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు.
మధ్యవర్తిత్వంతో నష్టం లేదు
మధ్యవర్తిత్వం నిర్వహించి కేసులను పరిష్కరించడం వల్ల న్యాయవాదులకు ఎటువంటి నష్టం ఉండదని సీనియర్ ట్రైనీ, ఢిల్లీ హైకోర్టు న్యాయవాది అనుజ సక్సేన తెలిపారు. శుక్ర వారం తిరుపతి న్యాయవాదుల అసోసియేషన్ హాల్లో తిరుపతి మండల న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు.ఉమ్మడి చిత్తూరు జిల్లా న్యాయ సేవ సంస్థ సెక్రటరీ భారతి, తిరుపతి న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు గోపీచంద్, ప్రధాన కార్యదర్శి మార్టిన్, న్యాయవాదులు పాల్గొన్నారు.
శ్రీకాళహస్తిలో ఎస్సీ, ఎస్టీలపై దాడులు
సాక్షి, న్యూఢిల్లీ: తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలోని శ్రీకాళహస్తిలో ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరుగుతున్నాయని, ఈ దాడులపై స్పందించాలని జాతీయ మానవ హక్కుల సంఘానికి వైఎస్సార్సీపీ అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి, తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శుక్రవారం చైర్మన్ వీ.రామసుబ్రమణియన్ను కలిసి దాడులకు సంబంధించిన వివరాలు, ఫిర్యాదు అందజేశారు. నేటికీ ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. ప్రాణభయంతో షికారీ కుటుంబాలు గ్రామాల్ని వదిలేస్తున్నారని తెలిపారు. అక్కడ అన్ని దాడులు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దీనిపై స్పందించి, ఆ దాడులకు పాల్పడుతున్న వారికి సరైన బుద్ధి చెప్పాలని, శిక్షించాలని డిమాండ్ చేశారు.