తిరుపతి అర్బన్:వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలో నెలకొన్న తొక్కిసలాటపై జ్యుడీషియల్ విచారణ కొనసాగుతోంది. అందులో భాగంగా జ్యుడీషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి ఎదుట విచారణకు దశలవారీగా అంతా హాజరవుతున్నారు. గురువారం అప్పటి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, అప్పటి టీటీడీ సీవీఎస్ఓ శ్రీధర్ను కలెక్టరేట్లో జ్యుడీషియల్ కమిషన్కు కేటాయించిన చాంబర్లో చైర్మన్ విచారించారు. ఆ మేరకు వారి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. బుధవారం విచారణకు అప్పటి ఎస్పీ సుబ్బరాయుడు, సీవీఎస్ఓ శ్రీధర్, అప్పటి టీటీడీ జేఈఓ గౌతమి హాజరైనప్పటికీ గౌతమిని మాత్రమే ఎక్కువ సమయం విచారించారు. ఈ క్రమంలో రెండోరోజు సుబ్బరాయుడు, శ్రీధర్ను విచారణ చేపట్టారు. శుక్రవారం మూడో రోజు వీరిద్దరిని విచారణ చేయనున్నారు. ఈ నెల 17న కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్, 18న టీడీపీ ఈఓ శ్యామలారావును విచారించిన సంగతి తెలిసిందే. నెల రోజులుగా జ్యుడీషియల్ చైర్మన్ నేతృత్వంలో జోరుగా విచారణ సాగుతుంది. తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందగా 44 మందికి గాయాలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నెల రోజులుగా రాష్ట్రంలో గాయపడిన వారితోపాటు వివిధ రాష్ట్రాల నుంచి తొక్కిసలాటలో గాయపడిన వారిని ఇప్పటికే విచారించారు. మరో రెండు రోజుల తర్వాత జనవరి 8న డ్యూటీలో ఉన్న ఉద్యోగులను విచారణ చేపట్టనున్నారు. అలాగే బైరాగిపట్టెడలోని శ్రీపద్మావతి పార్క్ సమీప ప్రాంతంలో దుకాణాలు నిర్వహిస్తున్న వారిని విచారించనున్నారు.
తిరుపతిలో వ్యక్తి దారుణ హత్య
తిరుపతి రూరల్: నగర శివార్లలో గుర్తుతెలియని వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం మేరకు.. తిరుపతి రూరల్ మండలంలోని వేదాంతపురం పంచాయతీలో ఉన్న ఓ హోటల్ సమీపంలోని ఖాళీ స్థలంలో గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. హత్యకు గురైన ఆనవాళ్లు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై స్పందించిన చంద్రగిరి డీఎస్పీ ప్రసాద్, తిరుచానూరు సీఐ సునీల్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అతని వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. హత్యకు గురైన వ్యక్తి ఆనవాళ్లు కనిపించకుండా చేయడానికి దుండగులు ముఖం, కాళ్లు, చేతులు, పొట్ట భాగంలో యాసిడ్ పోయడంతో అంతా కాలిపోయింది. దీంతో డాగ్ స్క్వాడ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, తనిఖీలు చేసింది. అలాగే వేలి ముద్రల నిపుణులు సైతం అక్కడకు చేరుకుని మృతదేహం వేలి ముద్రలు సేకరించారు. అనంతరం తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఏఎస్పీ రవిమనోహరాచారి, డీఎస్పీ ప్రసాద్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం రుయాకు తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.