కుక్కల దాడిలో తీవ్రగాయాలతో మహిళ మృతి
చుంచుపల్లి: ఓ మహిళపై వీధి కుక్క లు మూకుమ్మడిగా దాడి చేశాయి. అకస్మాత్తుగా జరిగిన దాడితో ఆమె కేకలు వేస్తున్నా.. సమీపంలో ఎవరూ లేకపోవడంతో తీవ్రగాయాల పా లైంది. ఆపై ఆస్పత్రికి తరలించినా ఫలితం లేక ఆమె ప్రాణాలు కోల్పోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం సాటివారిగూడెం ఎస్సీ కాలనీలో ఈ ఘటన జరిగింది.
స్థానికుల కథనం ప్రకారం.. కాలనీకి చెందిన మారె రాములమ్మ(40) తన ముగ్గురు కుమా రులతో కలిసి జీవిస్తోంది. సోమవారం ఉద యం కుమారులంతా రోజులాగే పనులకు వెళ్లారు. ఈ క్రమంలో తమ మేకపిల్లలను రాములమ్మ ఇంటికి కాస్త దూరంలోని వాగు ఒడ్డున పొలాల వద్దకు తీసుకెళ్లింది. అవి మేత మేస్తుండగా.. అక్కడ ఉన్న నాలుగు వీధి కుక్కలు ఒక్కసారి ఆమెపై దాడి చేశాయి.
నిలువరించేవారు లేక ఒంటరిగా ఉన్న రాములమ్మను అవి విచక్షణారహితంగా గాయప రిచాయి. సమీపంలో ఎవరూ లేకపోవడంతో ఆమె సాయంకోసం ఎంతగా అరిచినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ముఖం, శరీరంపై తీవ్రగాయాలతో రాములమ్మ కింద పడిపోయింది. కాసేపటికి ఆమెను గమనించిన స్థానికులు హుటాహుటిన కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేస్తుండగానే పరిస్థితి విషమించడంతో రాములమ్మ మృతి చెందింది.


