అదిగో భద్రాద్రి.. ఇదిగో యాదాద్రి | Vaikuntha Ekadashi Celebrations At Sri Sitarama Chandra Swamy Temple In Bhadrachalam | Sakshi
Sakshi News home page

అదిగో భద్రాద్రి.. ఇదిగో యాదాద్రి

Jan 14 2022 3:29 AM | Updated on Jan 14 2022 3:47 PM

Vaikuntha Ekadashi Celebrations At Sri Sitarama Chandra Swamy Temple In Bhadrachalam - Sakshi

లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో స్వామివారి ఉత్తర ద్వార దర్శనం  

భద్రాచలం/యాదగిరిగుట్ట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో గురువారం వైకుంఠ ఏకాదశిని ఘనంగా నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వేదపండితుల మంత్రోచ్ఛరణలు, ధూపదీపాల నడుమ జే గంటలు మార్మోగుతుండగా జగదభి రాముడు గరుడవాహనంపై, సీతమ్మవారు గజవాహనంపై, లక్ష్మణస్వామి హనుమత్‌ వాహనంపై ఆసీనులై ఉత్తర ద్వారం గుండా దర్శనమిచ్చారు.


భద్రాద్రిలో ధూపదీపాల నడుమ ఉత్తర ద్వారం తెరుస్తున్న అర్చకులు, వేద పండితులు  

ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, జిల్లా అదనపు కలెక్టర్‌ కర్నాటి వెంకటేశ్వర్లు, ఆలయ ఈఓ శివాజీ తదితరులు పాల్గొన్నారు. కాగా, కోవిడ్‌ నిబంధనల కారణంగా భక్తులకు ప్రవేశం కల్పించకపోవడంతో పలువురు బారికేడ్ల ఆవలి నుంచే రామచంద్రస్వామి ని దర్శించుకున్నారు. ఇటు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోనూ గురువారం ముక్కోటి ఏకాదశి వేడుకలుఘనంగా జరిగాయి.

బాలాలయంలో ఆచార్యులు సుప్రభాతం, ఆరాధన, బాలభోగం, తిరుప్పావై చేపట్టి అలంకార సేవలు ఏర్పాట్లు చేశారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి వారు గరుడవాహనంపై బాలాలయంలోని తూర్పుద్వారం గుండా వైకుంఠ ద్వార దర్శనం ఇచ్చారు. పూర్వగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో సైతం శ్రీస్వామివారిని ఉత్తర ద్వారం గుండా భక్తులకు వైకుంఠదర్శనం కల్పించారు. సాయంత్రం శ్రీస్వామిని విష్ణుమూర్తిగా అలంకరించి మత్సా్యవతారంలో సేవను ఊరేగించారు. వేడుకల్లో ఈవో గీతారెడ్డి, అను వంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి పాల్గొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement