సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల సమగ్రాభివృద్ధి, గిరిజన సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర సచివాలయం వేదికగా ఒక కీలక సమావేశం జరిగింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క నేతృత్వంలో ఆదివాసీ, గిరిజన శాసనసభ్యుల బృందం ఇవాళ (గురువారం) సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని పెండింగ్ సమస్యలు, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రికి ఎమ్మెల్యేలు ఒక సమగ్ర వినతిపత్రాన్ని సమర్పించారు.
సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న అర్హులైన గిరిజనుల పోడు భూములకు తక్షణమే పట్టాలు పంపిణీ చేయాలని, దాంతో పాటు గిరిజన రైతులకు సాగునీరు అందించేలా 'ఇందిర గిరి జల వికాసం' పథకాన్ని క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. గిరిజన విద్యార్థులకు ఉన్నత చదువులను చేరువ చేసే క్రమంలో రాష్ట్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలను ఇంటర్మీడియట్ వరకు అప్గ్రేడ్ చేయాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పరిపాలనను, సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత వేగంగా చేర్చడానికి వీలుగా ఐటీడీఏ (ITDA)లను ఆర్థికంగా, పరిపాలనాపరంగా మరింత బలోపేతం చేయాలని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.


