2025–26 ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్లు, అప్పుల కొత్త రికార్డు
గతంలో ఎన్నడూ లేనివిధంగా బెంచ్ మార్కులు దాటిన రెండు కేటగిరీలు
రాష్ట్రంలో ఏటా పెరుగుతున్న బ్యాంకు డిపాజిట్లు
2021 మార్చి నాటికి మొత్తం డిపాజిట్లు రూ.5.71 లక్షల కోట్లు... 2026 మార్చికి రూ.9.43 లక్షల కోట్లు
అదే రీతిలో పెరుగుతున్న అప్పులు.. 2021 మార్చి నాటికి మొత్తం అప్పులు రూ. 6.27 లక్షల కోట్లు..2026 మార్చి నాటికి రూ.1.50 లక్షల కోట్లు
130 శాతం దాటిన క్రెడిట్ డిపాజిట్ నిష్పత్తి.... వెల్లడించిన ఎస్ఎల్బీసీ నివేదిక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏటా నగదు డిపాజిట్లు, అప్పులు పెరుగుతున్నాయి. 2026 మార్చి నాటికి గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని అన్ని రకాల బ్యాంకుల్లో కలిపి రూ. 9.43 లక్షల కోట్లు ఉంటే, అన్ని రకాల బ్యాంకుల ద్వారా తీసుకున్న మొత్తం అప్పులు రూ.12.33 లక్షల కోట్లు ఉన్నాయని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) గణాంకాలు చెబుతున్నాయి.
2025–26 సంవత్సరంలో ఈ డిపాజిట్లు, అప్పులు కొత్త బెంచ్ మార్కులను అధిగమించాయి. ఒకే సంవత్సరంలో నగదు డిపాజిట్లు రూ.లక్ష కోట్లు పెరగ్గా, అప్పులు రూ.1.5 లక్షల కోట్లు పెరిగాయి. 2025 మార్చి నాటికి రూ.8.40 లక్షల కోట్లు ఉన్న డిపాజిట్లు ..రూ.9.43 లక్షల కోట్లు కాగా, రూ.10.81 లక్షల కోట్లున్న రుణాలు.. రూ.12.33 లక్షల కోట్లకు పెరిగాయని ఎస్ఎల్బీసీ గణాంకాలు చెబుతున్నాయి.

ఆరేళ్లలో 70 శాతం పెరుగుదల
డిపాజిట్ల విషయానికి వస్తే 2021 మార్చి నాటికి రాష్ట్ర ప్రజలు రూ.5.71 లక్షల కోట్లు వివిధ బ్యాంకుల్లో డిపాజిట్లు చేశారు. ఆరేళ్ల కాలంలో ఈ డిపాజిట్లు దాదాపు 70 శాతం కంటే ఎక్కువ పెరిగాయి. డిపాజిట్ల విషయానికి వస్తే 2020–21లో రూ.87,649 కోట్లు, 2021–22లో రూ. 60, 616 కోట్లు, 2022–23లో రూ. 50,481 కోట్లు, 2023–24లో రూ. 96,947 కోట్లు, 2024–25లో రూ.60,477 కోట్లు, 2025–26లో రూ.1,02,995 కోట్లు పెరిగాయి.
⇒ అప్పుల విషయానికి వస్తే 2021 మార్చి నాటికి రూ.6.27 లక్షల కోట్లు ఉన్న అప్పులు దాదాపు రెట్టింపయ్యాయి. రాష్ట్రంలోని అన్ని రకాల బ్యాంకుల నుంచి తీసుకున్న మొత్తం అప్పు 2026 మార్చి నాటికి రూ.12,33,858 కోట్లకు చేరింది. ఇక, సంవత్సరాల వారీగా పరిశీలిస్తే 2020–21లో రూ.56,662 కోట్లు, 2021–22లో రూ.1,05,292 కోట్లు, 2022–23లో రూ.81,564 కోట్లు, 2023–24లో రూ.1,65,163 కోట్లు, 2024–25లో 1,02,302 కోట్లు, 2025–26లో రూ. 1,52,497 కోట్లు పెరిగాయని ఎస్ఎల్బీసీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
⇒ క్రెడిట్, డిపాజిట్ నిష్పత్తి (సీడీఆర్) ఆర్బీఐ లెక్కల ప్రకారం 60 శాతం ఉండాల్సి ఉండగా, ఈ రెండింటి నిష్పత్తి 2026 మార్చి నాటికి తెలంగాణలో 130.78 శాతానికి పెరగడం గమనార్హం.
గ్రామీణ ప్రాంతాల్లో విస్తరణ
బ్యాంకు శాఖల సంఖ్య ఏటేటా గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతోంది. 2021 మార్చి నాటికి రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 1,783 బ్యాంకు శాఖలుండగా, 2026 మార్చి నాటికి ఆ సంఖ్య 1,918కి చేరింది. సెమీ అర్బన్ ప్రాంతాల్లో 1,283 నుంచి 1,649కి పెరిగాయి. వీటితోపాటు అర్బన్, మెట్రో ప్రాంతాల్లో కలిపి 2021 మార్చిలో రాష్ట్ర వ్యాప్తంగా 5,762 బ్యాంకు శాఖలుండగా, 2026 మార్చి నాటికి 6,801కి పెరిగాయని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి లెక్కలు వెల్లడించాయి.


