
స్కూళ్లలో తెలుగు పాఠ్యపుస్తకంపై తేలని పంచాయితీ.. 9వ తరగతి నుంచి తెలుగును తప్పనిసరి చేసిన రాష్ట్రప్రభుత్వం
సింగిడి పుస్తకం సిఫార్సు చేసిన ఎన్సీఈఆర్టీ.. వెన్నెల పుస్తకం అనుసరించాలంటున్న ఎస్సీఈఆర్టీ
ఇంతవరకూ భేటీ అవ్వని కమిటీలు.. పుస్తకాల ప్రచురణలో మరింత జాప్యం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన విద్యా సంస్థల మధ్య తెలుగు పంచాయితీ ఎటూ తేలటంలేదు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని పాఠశాలల్లో 9వ తరగతి నుంచి తెలుగు సబ్జెక్టును రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దీంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సిలబస్ తీసుకున్న విద్యార్థులు కూడా తెలుగును చదవాల్సి ఉంటుంది. అయితే, అందుకోసం ఏ పాఠ్యపుస్తకాన్ని అనుసరించాలనే అంశంపై ఇంతవరకూ స్పష్టత ఇవ్వలేదు. దీంతో పాఠ్య పుస్తకాల ముద్రణ ప్రక్రియ కూడా మొదలవ్వ లేదు. మరోవైపు తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేయడాన్ని సీబీఎస్ఈ విద్యార్థుల తల్లిదండ్రులు వ్యతిరేకిస్తున్నారు. కొన్నిరోజుల క్రితం ఇందిరా పార్కు వద్ద ధర్నా కూడా చేశారు.
అసలు సమస్య ఏమిటి..?
విద్య రాజ్యాంగంలోని ఉమ్మడి జాబి తాలో ఉండటంతో వివిధ స్థాయిల్లో సిలబస్ను జాతీయ విద్య పరిశోధన శిక్షణ సంస్థ (ఎన్సీఈఆర్టీ), రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ సంస్థ (ఎస్సీఈఆర్టీ) కలిసి రూపొందిస్తుంటాయి. ఎన్సీఈఆర్టీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎస్సీఈఆర్ టీ రాష్ట్ర పరిధిలో పాఠ్యాంశాలను స్థానికతకు అనుగుణంగా తయారు చేస్తుంది. సీబీఎస్ఈ విద్యార్థులకు అన్ని సబ్జెక్టుల పాఠ్యాంశాలను ఎన్సీఈఆర్టీ రూపొందిస్తుంది.
ఇప్పుడు తెలుగును తప్పనిసరి చేయడంతో కేంద్ర, రాష్ట్ర సంస్థలు కలిసి పాఠ్యాంశాలను రూపొందించాల్సి ఉంది. ఈ క్రమంలో ఎన్సీఈఆర్టీ 089 కోడ్ ఉన్న పాఠ్య పుస్తకాన్ని సిఫార్సు చేసింది. దీని ప్రకారం ‘సింగిడి’పుస్తకాన్ని అనుసరించాలని సూచి ంచింది. రాష్ట్రంలో విద్యార్థులకు మాత్రం ఎస్సీఈఆర్టీ ‘వెన్నెల’ పాఠ్యపుస్తకాన్ని సిఫార్సు చేస్తోంది. దీంతో దేన్ని ఎంపిక చేస్తారనే అయోమయం నెలకొంది.
ఏ పుస్తకంలో ఏముంది?
రాష్ట్ర ప్రభుత్వం అనుసరించే వెన్నెల తెలుగు పాఠ్య పుస్తకం తెలుగు విద్యార్థులకు సులభంగా ఉంటుంది. స్థానిక భాష, సామెతలు, వాడుక భాష పదాలు, తేలి కగా అర్థమయ్యే వ్యాకరణం ఇందులో ఉంటాయి. ఇది స్థానిక పరిస్థితుల నుంచి రూపొందించింది. గ్రామీణ తెలుగు విద్యార్థి తేలికగా మార్కులు పొందే అవకాశం ఉంటుంది. ఎన్సీఈఆర్టీ సూచించే సింగిడి పాఠ్య పుస్తకంలో ప్రతీ పాఠం విశ్లేషాణాత్మకంగా, ఇంటర్ ఆ పై స్థాయి విద్యార్థులకు బోధించేలా ఉంటుంది.
జాతీయ స్థాయిలో మాట్లాడే వివిధ భాషల పదాలను సింగిడి ద్వారా తెలుగులోకి తీసు కొచ్చినట్టు చెబుతున్నారు. దీన్ని తెలుగు గ్రామీణ విద్యార్థులు తేలికగా అర్థం చేసుకోవడం కష్టమంటున్నా రు. దీన్ని ప్రవేశ పెడితే తెలుగు భాషలోనే చాలామంది విద్యార్థులు కనీస మార్కులు పొందడం కష్టమనే ఆందోళన వ్యక్తమవుతుంది. సీబీఎస్ఈ విద్యార్థుల నుంచి వెన్నెల పుస్తకంపై ఇదే స్థాయి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇతర రాష్ట్రాలవారు కూడా వారి పిల్లలను తెలంగాణలో చదివిస్తున్నారు. వాళ్లకు స్థానిక భాషతో తెలుగు చదవడం కష్టమని అంటున్నారు.
కుదరని ఏకాభిప్రాయం
పాఠ్య పుస్తకం ఎంపికపై ఎన్సీఈఆర్టీ, ఎస్సీఈఆర్టీ అధికారులు ముందుగా కమి టీలు ఏర్పాటు చేయాలి. సిలబస్, పాఠ్యాంశాలు, అందులో చేర్పులు, మార్పులపై చర్చించి ఓ నిర్ణయానికి రావాలి. ఆ తర్వాత పాఠ్యపుస్తకాలను ఖరారు చేస్తారు. అయితే, రెండు సంస్థలు మొండి పట్టు దలకు పోవ టంతో ఇంతవరకూ సమా వేశం జరగలేదు. రాష్ట్రంలో 450 సీబీఎస్ఈ పాఠశాలలు న్నాయి. వీటిల్లో 50 వేలకు పైగా విద్యా ర్థులు చదువుతు న్నారు. రెండు సంస్థల పంచాయితీ కారణంగా విద్యా ర్థుల్లో ఆందోళన పెరుగుతోంది. పాఠ్యపుస్త కాలపై స్పష్టత ఇవ్వాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
రెండో భాషను ఎంచుకునే స్వేచ్ఛ ఉండాలి..
గుజరాత్ నుంచి ఉద్యోగ రీత్యా ఇక్కడికి వచ్చాం. మా పిల్లలకు తెలుగు రాదు. అయినా తెలుగు భాషను తప్పనిసరి చేస్తామంటున్నారు. ఇది ఇబ్బంది కాదా? ద్వితీయ భాషను ఎంచుకునే స్వేచ్ఛ ఇవ్వాలి. – పల్లవ్ ఉజ్వల్, సీబీఎస్ఈ స్కూల్ విద్యార్థి తల్లి.
సింగిడి పుస్తకం తెలుగు విద్యార్థులకు కష్టం..
సింగిడి పాఠ్యపుస్తకం జాతీయ ప్రామాణికతను దృష్టిలో పెట్టుకుని రూపొందించింది. దీన్ని మన రాష్ట్ర విద్యార్థులపై రుద్దితే నష్టపోతారు. ఇంటర్ ఆ పైస్థాయిలో ఉండే వ్యాకరణం ఇందులో ఉంటుంది. గ్రామీణ విద్యార్థులు అంత తేలికగా అర్థం చేసుకునేలా లేదు. మనవాళ్లకు వెన్నెల సులభం. సీబీఎస్ఈ విద్యార్థులు కాస్త కష్టపడితే వెన్నెల పుస్తకాన్ని అనుసరించడం కష్టమేమీ కాదు. – వసంత్కుమార్, తెలుగు టీచర్, హైదరాబాద్.