సాక్షి, హైదరాబాద్: ప్రసార మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న దేవాదాయ శాఖ ఉద్యోగ ప్రకటన నకిలీదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన 190 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైనట్లు సోషల్ మీడియా, వివిధ వెబ్సైట్లలో వస్తున్న వార్తలను ప్రభు త్వం ఖండించింది. ఈ మేరకు ఆ శాఖ డిప్యూటీ కమిషనర్ డి.కృష్ణప్రసాద్ గురువారం ప్రకటన విడుదల చేశారు.
నిరుద్యోగులను తప్పుదోవ పట్టించేలా ప్రభుత్వ ముద్ర, దేవాదాయ శాఖ పేరుతో నకిలీ నోటిఫికేషన్ను సృష్టించారన్నారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తామంటూ మే 30 వరకు గడువు ఇచ్చినట్లు ప్రచారం సాగుతోందని, అయితే తమ శాఖ నుంచి ఎలాంటి ఉద్యోగ ప్రకటన విడుదల కాలేదని స్పష్టం చేశారు.


