నాగోలు: పెంచిన మెయింటెనెన్స్ కాకుండా పాత పద్ధతిలో మెయింటెనెన్స్ కట్టారని వారం రోజులుగా ఓ ప్లాట్కు రాజీవ్ స్వగృహ టౌన్ షిప్ కమిటీ సభ్యులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. వారం రోజులుగా బాధిత కుటుంబం చిన్న పిల్లలతో సహా చీకట్లో ఉంటున్నారు. ఈ సంఘటన నాగోలు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
బాధితుడు తెలిపిన మేరకు.. నాగోలు బండ్లగూడలోని రాజీవ్ స్వగృహ సీ–బ్లాక్ లో బీజే చక్రపాణి గతంలో ప్లాట్ కొనుగోలు చేసి అక్కడే నివాసం ఉంటున్నాడు. బైలాస్కు వ్యతిరేకంగా పెంచిన నిర్వహణ ఖర్చుల గురించి అపార్ట్మెంట్ అసోసియేషన్ సభ్యులను చక్రపాణి ప్రశ్నించాడు. దీంతో అసోసియేషన్ సభ్యులు అతని కుటుంబాన్ని వేధించడం మొదలుపెట్టారు. 4 నెలల నుంచీ ఫ్లాట్కు తరుచూ విద్యుత్ నిలిపివేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అయితే వారం రోజులుగా విద్యుత్ను పూర్తిగా నిలిపివేశారు.
అసలే వేసవి.. చిన్న పిల్లలతో ఉక్కపోతకు తీవ్ర ఇబ్బంది పడుతున్నా కనికరించకుండా కమిటీ సభ్యులు దౌర్జన్యం చేస్తున్నారని నాగోలు పీఎస్లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో నాగోలు పోలీసులు అసోసియేషన్ సభ్యులతో మాట్లాడి గురువారం సాయంత్రం విద్యుత్ను పునరుద్ధరించి వెళ్లారు. అయితే ఆ తరువాత ఎప్పటి లాగానే ఫ్లాట్కు విద్యుత్ను నిలిపివేశారు. దీంతో తనకు జరుగుతున్న అన్యాయంపై బాధితుడు రాష్ట్ర ఎస్సీ కమిషన్ను ఆశ్రయించాడు. తనకు న్యాయం చేయాలని అధికారులను కోరారు.


