ప్రజావాణి: ఈ మహిళ పేరు స్వప్న.. తాగడానికి నీరు దొరకలేదు | Public platform in jagtial Collectorate | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌లో ప్రజావాణి: ఈ మహిళ పేరు స్వప్న.. తాగడానికి నీరు దొరకలేదు

May 16 2023 12:43 PM | Updated on May 16 2023 2:44 PM

Public platform in jagtial Collectorate - Sakshi

ఈ మహిళ పేరు స్వప్న. వెల్గటూర్‌ మండలం ముంజంపల్లి స్వగ్రామం. ఉదయం 10.30 గంటలకు కలెక్టరేట్‌లోని ప్రజావాణి వేదిక వద్దకు చేరుకుంది. తాగడానికి సమీపంలో ఎక్కడా నీరు దొరకలేదు. దాహంతో తపించిపోయింది.

జగిత్యాల: అసలే ఎండాకాలం. ఎండలు మండిపోతున్నాయి. దాహం కోసం ప్రజలు తపిస్తున్నారు. అయినా, కలెక్టరేట్‌లో సోమవారం చేపట్టిన ప్రజావాణిలో కనీస సౌకర్యాలు కల్పించలేదు. కలెక్టరేట్‌ మొత్తంగా పచ్చదనం పర్చుకుని, ఆహ్లాద వాతావరణం పంచుతూ ఉన్నా.. మౌలిక వసతులు లేవు. దీంతో ప్రజావాణికి హాజరైన అభాగ్యులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బస్టాండ్‌ నుంచి దాదాపు కి.మీ. దూరం కలెక్టరేట్‌ ఉంది. అక్కడిదాకా ఆటోలు, ప్రైవేట్‌ వాహనాలు తప్ప ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. అధిక వ్యయ ప్రయాసలకోర్చి ప్రజావాణికి చేరుకున్నా తాగేందుకు చుక్కనీరు లభించని పరిస్థితి నెలకొంది.

సమస్యలు పరిష్కరించండి
ప్రజావాణి ద్వారా స్వీకరించే అర్జీలు క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్‌ యాస్మిన్‌ బాషా అధికారులను ఆదేశించారు. ప్రజా వాణి ద్వారా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అభాగ్యుల నుంచి 54 ఫిర్యాదులు స్వీకరించిన అనంతరం కలెక్టర్‌ మాట్లాడారు. అడిషనల్‌ కలెక్టర్‌ లత, అధికారులు పాల్గొన్నారు.

ధాన్యం తూకంలో మోసాలు..
ధాన్యం తూకంలో మోసాలు చోటుచేసుకుంటున్నాయని, కొనుగోళ్లను వేగవంతం చేసి రైతులను ఆదుకోవాలని బీజేపీ నాయకులు కోరారు. ప్రజావాణిలో వారు ఒక వినతిపత్రం అందజేశారు. ఒక్కో కొనుగోలు కేంద్రంలో ఒక్కో విధంగా ధాన్యం తూకం వేస్తున్నారని ఆరోపించారు. మిల్లుకు చేరాక ధాన్యంలో మళ్లీ కోత విధిస్తున్నారని వారు ఆరోపించారు. ఇలాంటి మోసాలను అరికట్టి, కొనుగోళ్లను వేగంగా పూర్తిచేయాలని నాయకులు కోరారు. కార్యక్రమంలో నాయకులు పన్నాల తిరుపతిరెడ్డి, మోహన్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, జలేందర్, కంచర్ల అఖిల్, రాకేశ్, తిరుపతిరెడ్డి, రాజు పాల్గొన్నారు.

రైతులను ఆదుకోండి
ధాన్యం కొనుగోళ్లలో నిర్వాహకులు, రైస్‌మిల్లర్లు రైతులను మోసం చేస్తున్నారని, అన్నదాతలను ఆదుకోవాలని కాంగ్రెస్‌ నాయకులు కోరారు. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులకు జరుగుతున్న నష్టాలపై వారు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి రోజులు గడుస్తున్నా నిర్వాహకులు కొనుగోలు చేయడంలేదని ఆరోపించారు. జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు లక్ష్మణ్‌కుమార్, మ హిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు విజయలక్ష్మి, మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు సిరాజొదీ్దన్‌ మన్సూర్, నాయకుడు వాకాటి సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement