లేదంటే ఉపాధ్యాయుల ఆగ్రహాన్ని రుచి చూడాల్సి ఉంటుంది: ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్ : ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తేనే రేవంత్రెడ్డి తను చెప్పుకుంటున్నట్టు 2034 వరకూ అధికారంలో ఉంటారని, లేని పక్షంలో టీచర్ల ఆగ్రహాన్ని రుచి చూడాల్సి ఉంటుందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి హెచ్చరించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని, ఇక ఏమాత్రం ఉపేక్షించేది లేదని, ఆందోళన బాట పడతామన్నారు. పీఆర్టీయూ టీఎస్ నేతృత్వంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మంగళవారం మహాధర్నా జరిగింది. అన్ని జిల్లాల నుంచి టీచర్లు పెద్ద ఎత్తున ఈ ధర్నాకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా శ్రీపాల్రెడ్డి మాట్లాడుతూ రేవంత్రెడ్డి అధికారం చేపట్టి వేయి రోజులైనా జీతాలు ఇవ్వడం మినహా తమకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేరలేదన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సీపీఎస్ను రద్దు చేశాయని, తెలంగాణలో మాత్రం ఇది ఎందుకు అమలు కాలేదని ప్రశ్నించారు. శ్రీపాల్ ప్రసంగం కొనసాగినంత సేపు టీచర్లు ఉద్విగ్న భరితంగా కరతాళ ధ్వనులు చేశారు.
పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలకు పరిష్కారం సాధించే దిశగానే పనిచేస్తున్నామని, తమ సంఘం ఏ రాజకీయ పార్టీకి వత్తాసు పలకదని స్పష్టం చేశారు. మహాధర్నాలో సంఘం ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షంగౌడ్, మాజీ ఎమ్మెల్సీ బి మోహన్ రెడ్డి, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పెరి వెంకట్రెడ్డి, వంగ మహేందర్ రెడ్డి, గుండు లక్ష్మణ్ పాల్గొన్నారు.


