పురపాలికలకు అందని రూ. 2,500 కోట్లు | Municipalities not getting Rs 2500 crores | Sakshi
Sakshi News home page

పురపాలికలకు అందని రూ. 2,500 కోట్లు

Aug 11 2024 5:07 AM | Updated on Aug 11 2024 5:07 AM

Municipalities not getting Rs 2500 crores

మ్యుటేషన్‌ ఫీజు, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీలో వాటా విడుదల చేయని ప్రభుత్వం 

నిధుల్లేక ప్రజలకు కనీస సేవలు అందించలేకపోతున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు 

సాక్షి, హైదరాబాద్‌: నిధుల్లేక ప్రజలకు కనీస సేవలు కూడా చేయలేకపోతున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లకు ప్రభుత్వం నుంచి దక్కాల్సిన సాయం అందడం లేదు. పట్టణాలు, నగరాల్లో ఇళ్లు, స్థలాల క్రయవిక్రయాలతోపాటు కుటుంబ వారసత్వ పంపకాల సమయంలో రిజి్రస్టార్లు మ్యుటేషన్‌ ఫీజుల రూపంలో ఫీజు వసూలు చేస్తారు. 

అలాగే భూ హక్కుల బదిలీ కింద ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీలు, సేవా పన్నులు సైతం కట్టించుకుంటారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేసినప్పటికీ, ఇందులో మ్యుటేషన్‌ ఫీజు, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీలకు సంబంధించి ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఏటా వాటా ఇవ్వాలి. 

అయితే 2021 ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు పురపాలికలకు రావాల్సిన రూ. 2,500 కోట్ల విలువైన మ్యుటేషన్‌ ఫీజు, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీలు విడుదల కాలేదు. దీంతో పట్టణాల్లో ఎన్ని భూ లావాదేవీలు జరుగుతున్నా ఆయా మున్సిపాలిటీలకు పైసా లాభం ఉండట్లేదు. కొన్ని పురపాలికల్లో కాలువల్లోని పూడిక తీయడానికి, చెత్త ఎత్తే ట్రాక్టర్లకు డీజిల్‌ పోయించడానికి కూడా డబ్బుల్లేని పరిస్థితి నెలకొంది. 

మ్యాచింగ్‌ గ్రాంట్‌ రూ. 800 కోట్లు  
స్థానిక సంస్థలను పరిపుష్టం చేసేందుకు కేంద్రం ఏటా ఆర్థిక సంఘం నిధులను విడుదల చేస్తూ వస్తోంది. 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్రం ఆయా పట్టణ పాలకమండళ్లకు రూ. 800 కోట్లు విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన మ్యాచింగ్‌ గ్రాంట్‌ రూ. 800 కోట్లు ఇంకా విడుదల కాలేదు. ఈ మొత్తం విడుదలై యుటిలైజేషన్‌ సరి్టఫికెట్‌ (యూసీ) పంపిస్తేనే తిరిగి మున్సిపాలిటీలకు మరిన్ని నిధులు వచ్చే అవకాశం ఉంది. 

మరోవైపు పట్టణ ప్రగతి కింద ప్రతి మున్సిపాలిటీలో దోబీఘాట్ల నిర్మాణానికి గత ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఈ మేరకు చాలా మున్సిపాలిటీల్లో పనులు పూర్తయ్యాయి. కొన్ని చోట్ల మధ్యలోనే నిలిచిపోయాయి. అయితే దోభీఘాట్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పట్టణాలకు రూ. 282 కోట్లు రావలసి ఉంది. ఈ విషయంలో కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పాలక మండళ్లు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.  

Advertisement
 
Advertisement
Advertisement