నలిగిపోతున్ననాలుగో సింహం | Many police personnel are suffering by BP and sugar | Sakshi
Sakshi News home page

నలిగిపోతున్ననాలుగో సింహం

Nov 6 2024 4:12 AM | Updated on Nov 6 2024 4:12 AM

Many police personnel are suffering by BP and sugar

40% మందిసిబ్బందికి బీపీ, షుగర్‌ పని ఒత్తిడి..

సమయం తప్పిన ఆహారపు అలవాట్లు  

పోలీస్‌ అధికారులు విధులకు ఒకవేళంటూ ఉండదు. లా అండ్‌ ఆర్డర్‌లో ఉండే సిబ్బందికి ఉరుకులుపరుగులు మరీ ఎక్కువ. శాంతిభద్రతల పరిరక్షణ, బందోబస్తులు, కేసుల దర్యాప్తు, కోర్టులకు హాజరుకావడం..ఉన్నతాధికారుల సమీక్షలకు వెళ్లడం..ఇలా బహుళ డ్యూటీలు చేస్తుండాలి. ఏఆర్, టీజీఎస్పీ సిబ్బంది విధుల్లోనూ తిప్పలు తప్పవు. పండుగలు, సభలు, సమావేశాలు, వీఐపీల బందోబస్తులంటూ గంటల తరబడి నిలబడక తప్పదు. 

ఇలా శారీరకంగా, మానసికంగానూ శ్రమ ఎక్కువే. ఈ ప్రభావం అంతా పోలీసుల ఆరోగ్యంపై వివిధ జబ్బుల రూపంలో చూపుతోంది. బీపీ, షుగర్‌తో మొదలై క్రమంగా పలు ప్రమాదకర జబ్బులకు దారితీస్తోంది. 2019 నుంచి ఈ ఏడాది అక్టోబర్‌ 21 వరకు ఆరోగ్య భద్రత అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం..6,347 మంది కేన్సర్‌ చికిత్స తీసుకున్నారు. రెండో స్థానంలో కిడ్నీ రోగులు ఉన్నారు. 

4,922 మంది నెఫ్రాలజీ చికి త్స తీసుకున్నారు. యూరాలజీ సమస్యలతోనూ ఎక్కువ మందే బాధపడుతున్నారు. గుండె జబ్బుల కారణంగా 2,875 మంది ఆస్పత్రులపాలయ్యారు. మానసిక ఒత్తిడిసైతం అధికంగానే ఉంటోంది. కొన్నిసార్లు బీపీ పెరగడంతో న్యూరో సమస్యలు వస్తున్నాయి. న్యూరాలజీకి సంబంధించి 1,937 మంది చికిత్స పొందారు.  


వేతనం నుంచి కార్పస్‌ ఫండ్‌కు నిధులు  
ఆరోగ్య భద్రత కార్పస్‌ ఫండ్‌ కోసంకానిస్టేబుల్‌ నుంచి ఎస్సై ర్యాంకు వరకుకేటగిరీ–1 కింద నెలకు రూ.200 చొప్పున,ఇన్‌స్పెక్టర్‌ నుంచి డీజీపీ ర్యాంకు వరకుకేటగిరీ–2 కింద అధికారుల వేతనంలో నెలకు రూ.250 చొప్పున జమ చేస్తున్నారు. ఇలా పోలీస్‌శాఖలోని 68 వేల మంది సిబ్బంది నుంచి ఈ కార్పస్‌ ఫండ్‌ నిధులు జమ అవుతుంటాయి.  

కేన్సర్‌..లేదంటే కిడ్నీ సమస్యలతో పోలీసుల సతమతం
సాక్షి, హైదరాబాద్‌: కేన్సర్‌..లేదంటే కిడ్నీ జబ్బుల బారిన పడే పోలీసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఐదేళ్ల గణాంకాలు పరిశీలిస్తే..ఈ విషయం స్పష్టమవుతోంది. పోలీస్‌శాఖలోని దాదాపు 40 శాతం మందికిపైగా సిబ్బందికి బీపీ, షుగర్‌ రావడం సర్వసాధారణంగా మారింది. పనిఒత్తిడి, సమయం తప్పిన ఆహారంతోనూ అనారోగ్య సమస్యలకు దారితీస్తోంది. పోలీస్‌ అధికారులు, సిబ్బంది..వారి కుటుంబీలకు ఆరోగ్య భద్రత పథకం కింద పలు నెట్‌వర్క్‌ ఆస్పత్రులలో వైద్యం అందిస్తున్నారు. ఆరోగ్య భద్రత కింద 2019 నుంచి ఈ ఏడాది అక్టోబర్‌ 21 వరకు పోలీస్‌ అధికారులు, సిబ్బంది, మినిస్టీరియల్‌ సిబ్బంది కలిపి మొత్తం 1,04,014 మంది పలు రోగాలకు చికిత్సలు పొందారు. 

వీరి వైద్యం కోసం రూ.446.3 కోట్లు ఖర్చు చేశారు. పోలీస్‌ సిబ్బంది తల్లిదండ్రుల్లో 45,923 మంది చికిత్సకు రూ.318.03 కోట్లు ఖర్చు చేశారు. వైద్యంతోపాటు సిబ్బంది ఆరోగ్య పరిరక్షణలో భాగంగా తెలంగాణ పోలీస్‌శాఖ నుంచి ఆరోగ్య భద్రత కింద ప్రతి రెండేళ్లకు ఒకసారి ఉచిత ఆరోగ్యశిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు.ఓపీ పేషెంట్లకు సబ్సిడీ ధరలకే వైద్య పరీక్షలు చేసేలా రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది రకాల డయాగ్నొస్టిక్‌ సెంటర్లతో ఆరోగ్య భద్రత ఒప్పందం కుదుర్చుకుంది.

 అయితే ఆరోగ్య భద్రత కింద లబ్దిదారుల సంఖ్యతోపాటు వైద్యఖర్చులు పెరగడంతో ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం నుంచి రావా ల్సిన రీయింబర్స్‌మెంట్‌ నిధులు సైతం పేరుకుపోతున్నాయి. 2021 నుంచి రీయింబర్స్‌మెంట్‌ సకాలంలో జరగడం లేదు. దాదాపు రూ.200 కోట్ల వరకు ఆరోగ్య భద్రత నిధులు పెండింగ్‌ ఉండగా.. ఇటీవలే 30 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. రీయింబర్స్‌మెంట్‌ నిధుల పెండింగ్‌ కారణంగా కొన్ని సార్లు ఆస్పత్రులు వైద్యం అందించేందుకు ఇబ్బంది పెడుతున్న సందర్భాలూ ఉంటున్నాయి. ఎప్పటికప్పుడు పోలీస్‌ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుంటూ సిబ్బందికి సకాలంలో వైద్యం అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇవీ జబ్బులకు ప్రధాన కారణాలు
» పోలీస్‌ అంటే 24 గంటలపాటువిధి నిర్వహణ తప్పని ఉద్యోగం.పోలీస్‌స్టేషన్లలో శాంతిభద్రతల విధులు మొదలు ఏ ప్రత్యేక బలగంలో ఉన్నా.. ఒత్తిడి తప్పనిసరి అవుతోంది. 

»  ఎండ, వాన, చలి,దుమ్మూధూళి, కాలుష్యంఇలా పలు రకాల వాతావరణ పరిస్థితుల్లో పనిచేయడం సైతం జబ్బులకు కారణమవుతోంది.  

» బందోబస్తు విధుల్లో ఉన్నా.. ట్రాఫిక్‌ విధుల్లో ఉన్నా..గంటల తరబడి నిలబడక తప్పని పరిస్థితి.  

»  ఆహార నియమాలవిషయంలో శ్రద్ధ తీసుకోవాలని ఉన్నా.. తీసుకునేలా పరిస్థితులు లేకపోవడం సైతం అనారోగ్యానికి కారణం అవుతోంది.  

»  శాంతిభద్రతల విధుల్లో ఒక్కోసారి తగినంత విశ్రాంతి తీసుకోవడం సాధ్యం కాని పరిస్థితులుఉండడం సైతం శారీరకశ్రమను పెంచుతోంది.  

Advertisement
 
Advertisement
Advertisement