సాక్షి,హైదరాబాద్: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. రంగనాథ్ను కమిషనర్ పదవి నుంచి తొలగించాలని, ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసనం (డివిజన్ బెంచ్) సస్పెండ్ చేసింది.
అక్రమ కట్టడాల కూల్చివేతలకు సంబంధించిన ఒక పిటిషన్ విచారణ సందర్భంగా.. రంగనాథ్ వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సింగిల్ బెంచ్ ఆయనపై కఠిన ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ హైడ్రా వర్గాలు, ప్రభుత్వ లాయర్లు డివిజన్ బెంచ్ను ఆశ్రయించారు.
ఈ పిటిషన్పై మంగళవారం విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్ బెంచ్.. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్పై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి సమగ్ర విచారణను నవంబర్ 3వ తేదీకి వాయిదా వేసింది. డివిజన్ బెంచ్ ఇచ్చిన ఈ స్టేతో హైడ్రా కమిషనర్గా రంగనాథ్ తన విధులు కొనసాగించడానికి మార్గం సుగమమైంది.


