సాక్షి, మహబూబ్నగర్: జిల్లాలో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రేసింగ్ బైక్, కారు ఢీ కొని ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఒకరు గాయపడగా చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు.
పాలకొండ చౌరస్తాలో అర్ధరాత్రి దాటాక ఈ ఘోరం జరిగింది. కారు డివైడర్ దగ్గ యూటర్న్ తీసుకుంటుడగా.. వేగంగా దూసుకొచ్చిన బైక్ ఢీ కొట్టింది. ఈ యాక్సిడెంట్తో కారు, బైక్లు నుజ్జు నుజ్జు అయ్యాయి. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతులు మహబూబ్నగర్ న్యూప్రేమ్ నగర్కు చెందిన కుటుంబంగా గుర్తించారు.
మృతుల్లో.. ఆర్షియా బేగం(30), MD. ఉజేప (7), MD. అమర్ (2).. హైదరాబాద్కు చెందిన బైకర్ యాకుబ్ అఫ్జల్ (25) ఉన్నారు. మరో మృతదేహంపై స్పష్టత రావాల్సి ఉంది. గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బైక్ హర్యానా రిజిస్ట్రేషన్తో ఉంది.

పోలీసుల నిర్లక్ష్యంతోనే..
ఈ ఘటనలో పోలీసుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డులో రాత్రి 11గం. తర్వాత నుంచి తెల్లవారుజాము దాకా బైక్ రేసింగులు జరుగుతున్నాయని.. అటుగా వెళ్లే వాహనదారుల్ని భయానికి గురి చేస్తున్నాయని.. ఎన్ని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని అంటున్నారు. సకాలంలో చర్యలు తీసుకుని ఉంటే.. ఈ ఘోరం జరిగి ఉండేది కాదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విమర్శలపై పోలీసులు స్పందించాల్సి ఉంది.


