‘కృష్ణా’లో చుక్కెదురు | Krishna Boards three member committees recommendation | Sakshi
Sakshi News home page

‘కృష్ణా’లో చుక్కెదురు

Aug 24 2023 1:50 AM | Updated on Aug 24 2023 1:50 AM

Krishna Boards three member committees recommendation - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల నుంచి తాగునీటి అవసరాల కోసం సెపె్టంబర్‌ 30 తేదీ వరకు తెలంగాణకు 6.04 టీఎంసీలు, ఏపీకి 25.29 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కృష్ణాబోర్డు ఆధ్వర్యంలోని త్రిసభ్య కమిటీ సిఫారసు చేసింది. ఈనెల 21న హైదరాబాద్‌లోని జలసౌధలో జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో కన్వినర్‌ డీఎం రాయిపూరే ఈ నిర్ణయం తీసుకున్నారు.

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులో 15.609 టీఎంసీలు, శ్రీశైలంలో 58.865 టీఎంసీల లభ్యత మాత్రమే ఉందని, ఇండెంట్లలో కోరిన విధంగా తాగు, సాగునీటి అవసరాల కోసం రెండు రాష్ట్రాలకు కేటాయింపులు చేసేందుకు నిల్వలు సరిపోవని త్రిసభ్య కమిటీ అభిప్రాయపడింది.

తీవ్ర వర్షాభావం నెలకొని ఉండడంతో ప్రస్తుత నీటి సంవత్సరంలో ఎగువ నుంచి ఆశించిన మేర వరద వచ్చే అవకాశం లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో తాగునీటి అవసరాలకు మాత్రమే నీటి కేటాయింపులు జరపాలని నిర్ణయం తీసుకుంది. 

ఇప్పటికే తెలంగాణ 12 టీఎంసీలు, ఏపీ 7 టీఎంసీలు వాడుకున్నాయి  
ప్రస్తుత నీటి సంవత్సరం ప్రారంభం నుంచి ఈ నెల 16వ తేదీ వరకు ఏపీ 7.427 టీఎంసీ లు, తెలంగాణ 12.595 టీఎంసీలు కలిపి మొ త్తం 20.022 టీఎంసీల కృష్ణా జలాలను వినియోగించుకున్నట్టు త్రిసభ్య కమిటీ చెప్పింది.  

నాగార్జునసాగర్‌ కుడికాల్వ ద్వారా ఏపీ 3.592 టీఎంసీలు, శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా 2.088 టీఎంసీలు, సీడబ్ల్యూఎస్‌(తాగునీటి పథకం) ద్వారా 1.748 టీఎంసీలను ఏపీ వాడుకున్నట్టు పేర్కొంది.  
నాగార్జునసాగర్‌ప్రాజెక్టు నుంచి జంట నగరాల తాగునీటి అవసరాలకు 3.493 టీఎంసీలు, ఏఎంఆర్‌పీ ద్వారా 2.921 టీఎంసీలు, ఎడమకాల్వ ద్వారా 1.536 టీఎంసీలు కలిపి మొత్తం 7.95 టీఎంసీలను తెలంగాణ వాడుకుంది. శ్రీశైలం నుంచి కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 3.771 టీఎంసీలు, తాగునీటి కోసం 0.874 టీఎంసీలను తెలంగాణ వాడుకుంది.  

కృష్ణాబోర్డుకు లేఖ: కోటికి పైగా జనాభా కలిగిన హైదరాబాద్‌ అవసరాలకు కేవలం 4.8 టీఎంసీలను నాగార్జునసాగర్‌ నుంచి కేటాయించడం పట్ల తెలంగాణ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుద ల శాఖ ఈఎన్‌సీ సి.మురళీధర్‌ కృష్ణా బోర్డుకు లేఖ రాసినట్టు తెలిసింది. కృష్ణా బోర్డు నిర్ణయంతో తెలంగాణలో తీవ్ర తా గునీటి సమస్యలు ఉత్పన్నం అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement