ఖమ్మంవైద్యవిభాగం: ‘నెలలు నిండని చిన్నారి చేయిని తొలగించడం కలిచివేసింది.. ఈ ఘటన యావత్ సమాజాన్ని కదిలించేదిగా ఉంది. ఇది శిశువు ఆరోగ్య హక్కులు కాలరాయడమే అవుతుంది’అని మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. ‘సాక్షి’ప్రధాన సంచికలో ఆదివారం ‘చేజేతులా.. నిర్లక్ష్యం!’ శీర్షికన ప్రచురితమైన కథనంపై స్పందించిన మానవ హక్కుల కమిషన్.. విచారణ చేపట్టి నివేదిక అందించాలని జిల్లా వైద్య, ఆరో గ్య శాఖ అధికారిని ఆదేశించింది.
కవలల్లో బరువు తక్కువగా పుట్టిన ఓ చిన్నారిని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో చేర్పించగా.. తరచు రక్తం, ప్లేట్లెట్లు ఎక్కించాల్సి రావడంతో ఎడమ చేతికి క్యానులా పెట్టారు. అక్కడ వా పు వచ్చిన విషయాన్ని బంధువులు వైద్యులకు చెప్పినా పట్టించుకోలేదు. చేయి నల్లగా మారాక స్కానింగ్ చేయిస్తే పరిస్థితి తీవ్రత బయటపడింది. వైద్యులను నిలదీయడంతో నిలోఫర్కు పంపించారు. అక్కడ గతనెల 12న బాబు చేయి తొలగించారు.
సీఎంఓ ఆరా.. విచారణకు ఆదేశం: శిశువు చేయి తొలగించిన ఘటనపై ముఖ్యమంత్రి కార్యాలయం ఆరా తీసి, నివేదిక పంపించాలని కలెక్టర్కు సూచించిన ట్టు తెలిసింది. దీంతో వైరా మండలం పుణ్యపురానికి చెందిన తల్లి టి.రేణుక తన ఇద్దరు పిల్లలతో సోమవారం కలెక్టరేట్కు వచ్చింది. చేయి తొలగించిన చిన్నారిని చూసిన కలె క్టర్ దివాకర చలించిపోయారు. ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందని..తన బిడ్డ జీవితాంతం దివ్యాంగుడిగా మారాల్సి వచ్చిందని రేణుక విలపించింది. స్పందించిన కలెక్టర్ ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని, మెరుగైన చికిత్సకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.


