బంజారాహిల్స్: ర్యాపిడో డ్రైవర్కు, ప్రయాణికురాలికి మధ్య జరిగిన గొడవలో గుర్తుతెలియని వ్యక్తులు మధ్యవర్తుల్లా వ్యవహరించి వారి ఫోన్లు దోచుకెళ్లిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నాగర్కర్నూల్ జిల్లా టూడుకుర్తి గ్రామానికి చెందిన రేణుక(32) నగరంలో కొండాపూర్లో నివసిస్తోంది.
ఈ నెల 22న షేక్పేటలోని తన బంధువుల ఇంటికి వెళ్లిన ఆమె రాత్రి 8 గంటల సమయంలో తిరుగు ప్రయాణంలో ర్యాపిడో బుక్ చేసేందుకు ప్రయతి్నంచింది. ఈ సమయంలో తనను మహ్మద్ ఖాలిద్గా పరిచయం చేసుకున్న ఓ వ్యక్తి తాను ర్యాపిడో డ్రైవర్నని చెప్పి ఆమెను బైక్పై తీసుకువెళ్లేందుకు ముందుకువచ్చాడు. నమ్మకంతో రేణుక అతని బైక్పై ఎక్కింది.
జూబ్లీహిల్స్లోని పెద్దమ్మ ఆలయం వద్దకు చేరుకున్న తర్వాత చార్జీల విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అటుగా వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు మధ్యవర్తుల్లా వ్యవహరిస్తూ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి రేణుక, ఖాలిద్ల ఫోన్లు తీసుకుని పికప్, డ్రాప్ వివరాలు చెక్ చేస్తున్నట్లు నటించారు. ఈ క్రమంలో వారిద్దరి దృష్టి మరల్చి అక్కడి నుంచి పరారయ్యారు. కొద్దిసేపటి తర్వాత తమ ఫోన్లు దొంగిలించినట్లు గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.


