బండి సంజయ్‌ కుమారుడిపై పోక్సో కేసు | Hyderabad police register POCSO case against Bandi Sanjay son | Sakshi
Sakshi News home page

బండి సంజయ్‌ కుమారుడిపై పోక్సో కేసు

May 10 2026 5:39 AM | Updated on May 10 2026 5:39 AM

Hyderabad police register POCSO case against Bandi Sanjay son

కుత్బుల్లాపూర్‌/సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: కేంద్రమంత్రి బండి సంజయ్‌ తనయుడిపై హైదరాబాద్‌లోని పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో పోక్సో కేసు నమోదైంది. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గ పరిధిలోని సుచిత్ర ప్రాంతంలో ఉండే ఓ మైనర్‌ బాలిక (17) పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి ఇబ్బందులకు గురి చేశారని ఆరోపిస్తూ శుక్రవారం రాత్రి ఫిర్యాదురాగా పేట్‌ బషీరాబాద్‌ సీఐ విజయవర్ధన్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బండి సంజయ్‌ కుమారుడు బండి భగీరథ (24) డిసెంబర్‌ 31న మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌ హౌస్‌లో స్నేహం పేరిట తిరుగుతూ పెళ్లి చేసుకుంటానని నమ్మించి అదే రోజు రాత్రి అసభ్యకరంగా ప్రవర్తించాడనేది ప్రధాన ఆరోపణ. భగీరథపై పోలీసులు బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 74, 75తోపాటు సెక్షన్‌ 11 రెడ్‌విత్‌ 12 పోక్సో చట్టం కింద నమోదు చేశారు. భగీరథపై గతంలో బహదూర్‌పల్లిలో ఉన్న కళాశాలలో ర్యాగింగ్‌తోపాటు డ్రగ్స్‌ విషయంపై ఫిర్యాదులు రాగా దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. కాగా, ప్రధాని మోదీ నగరానికి విచ్చేస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కుమారుడిపై పోక్సో కేసు నమోదుకావడం చర్చనీయాంశమైంది. 

స్నేహం పేరుతో బ్లాక్‌మెయిల్‌ 
స్నేహం పేరుతో తనను బ్లాక్‌మెయిల్‌ చేస్తూ వివాహానికి ఒత్తిడి తెచ్చారని బండి సంజయ్‌ కుమారుడు బండి భగీరథ్‌ ఒక యువతిపై కరీంనగర్‌ టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రూ.5 కోట్లు డిమాండ్‌ చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. సదరు యువతితో తన స్నేహితులకు కూడా ఇలాంటి సమస్యలు ఎదురయ్యాయని తెలిపారు. ఈ మేరకు సదరు యువతి కుటుంబంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement