
ప్రపంచ వారసత్వ దినోత్సవం - 2025 సందర్భంగా హైదరాబాద్ హెరిటేజ్ వాక్
ప్రతి సంవత్సరం ఏప్రిల్ 18న నిర్వహించే ప్రపంచ వారసత్వ దినోత్సవం (International Day for Monuments and Sites) సందర్భంగా, ఈరోజు ఉదయం 7:30 గంటలకు డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ ఆధ్వర్యంలో, పురావస్తు శాఖ (ASI) – హైదరాబాద్ సర్కిల్, తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (TSTDC), JBRAC, ఫోరమ్ ఫర్ ఏ బెటర్ హైదరాబాద్, ఇతర పౌర సంఘాల భాగస్వామ్యంతో ఘనంగా హెరిటేజ్ వాక్ నిర్వహించబడింది.
Er. వేదకుమార్ మనికొండ, డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ ఛైర్మన్ ఈ కార్యక్రమాన్ని చార్మినార్ వద్ద ప్రారంభించి, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.
ప్రొఫెసర్ Ar. జి.ఎస్.వి. సూర్యనారాయణ మూర్తి(South Zone Representative, ICOMOS, India), డా. జి. జయశ్రీ, ప్రాచీన భారత చరిత్ర మరియు పురావస్తు శాఖ, ఉస్మానియా యూనివర్సిటీ, కోటయ్య వింజమూరి, డిప్యూటీ సూపరింటెండెంట్ కెమిస్ట్, ASI, డా. ఈ. సాయికృష్ణ, అసిస్టెంట్ ఆర్కియాలజిస్ట్, ASI, శ్రీమతి జె. రాజేశ్వరి (Conservationist, ASI), సాయి రామ్, సుధాకర్, కార్యనిర్వాహకులు(తెలంగాణ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్) , ఎస్. ప్రభాకర్(DTO, పర్యాటక శాఖ), డి. శ్రీనివాస్ (హెరిటేజ్ వాక్ ఇన్చార్జ్), డి. శ్యాం సుందర్ రావు, స్థపతి, డా. ద్యావనపల్లి సత్యనారాయణ(క్యురేటర్, తెలంగాణ గిరిజన మ్యూజియం), పి. వీరమల్లు, అధ్యక్షుడు, బౌద్ధ తత్వ ఫౌండేషన్ మరియు సిటీ కాలేజ్, JBRAC, ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్, SRDP, వాసవి స్కూల్, వైష్ణవి ఆర్కిటెక్చర్ కాలేజ్ విద్యార్థులు, పౌర సంఘాల సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
Er.వేదకుమార్ మనికొండ గారు చార్మినార్ నుండి చౌమహల్లా ప్యాలెస్ వరకు ఉన్న ముఖ్యమైన వారసత్వ కట్టడాల చారిత్రక ప్రాముఖ్యతను వివరిస్తూ, వారసత్వ సంరక్షణ అనేది ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, అది మన సమాజపు కలసికట్టు బాధ్యతగా భావించాలని సూచించారు. హైదరాబాద్ యొక్క చారిత్రక ఘనతను ప్రజలకు తెలియపరుస్తూ, వారసత్వ పరిరక్షణ మరియు పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో ప్రజల భాగస్వామ్యం అవసరాన్ని వివరించారు.
ఇంకా, తెలంగాణ వారసత్వ శాఖ మరియు డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ సంయుక్తంగా ముదుమల్ మెగలిథిక్ మెన్హిర్స్ సైట్ ను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రాథమిక జాబితాలో చేర్చించడంలో చేసిన ప్రయత్నాలను వివరించారు. త్వరలో ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ సూర్యనారాయణ మూర్తి గారు మాట్లాడుతూ, ఇటువంటి వాక్ల ప్రాముఖ్యతను వివరించారు. చార్మినార్ యొక్క చారిత్రక, శిల్పకళా విశేషాలను విద్యార్థులకు వివరించారు.
చార్మినార్ మీదుగా లాడ్ బజార్, మోతిగల్లి,మెహబూబ్ చౌక్ (ముర్గీ చౌక్), ఇక్బాల్ ఉద్ దౌలా దేవ్డీ, మక్కా మసీదు ద్వితీయ ద్వారం, జిలుఖానా,ఖుర్షీద్ జా బహదూర్ ప్యాలెస్,ఇక్బాల్ ఉద్ దౌలా ప్యాలెస్, ఖిలావత్, చౌమహల్లా ప్యాలెస్ వద్ద ఈ వాక్ ముగిసింది.ఈ వాక్ ద్వారా పాల్గొన్నవారికి హైదరాబాద్ నగరపు ప్రాచీన వైభవాన్ని ప్రత్యక్షంగా అనుభవించగలిగారు. రాజప్రాసాదాలు, శతాబ్దాల నాటి మసీదులు, స్థానిక శిల్పకళ ఆధారిత నిర్మాణాలు వారి చూపుల ముందే ఆవిష్కృతమయ్యాయి. నగరపు బహుముఖ సంస్కృతి మరియు వారసత్వంపై గర్వభావం వారిలో మళ్ళీ వెల్లివిరిసింది.