గోల్డెన్‌ డేస్‌.. | Gold prices are increasing day by day | Sakshi
Sakshi News home page

గోల్డెన్‌ డేస్‌..

Apr 13 2025 2:23 AM | Updated on Apr 13 2025 2:23 AM

Gold prices are increasing day by day

గ్రేటర్‌లో రూ.96 వేలు దాటిన తులం బంగారం

రోజురోజుకూ పెరుగుతున్న పసిడి ధరలు 

ఒకవైపు రేట్లు పెరుగుతున్నా తగ్గని అమ్మకాలు 

రోజుకు గ్రేటర్‌లో 50–60 కిలోల ముడి బంగారం అమ్మకం 

లక్షకు చేరుతుందేమోనని ఎగబడి కొంటున్న నగరవాసులు 

శుభకార్యాలు, పండుగల సీజన్‌ కావడంతోనూ దుకాణాలకు పరుగులు 

మెట్రో నగరాలతో పోలిస్తే మన దగ్గరే ధర తక్కువ 

అత్యధికంగా బెంగళూరు, చెన్నైలలో పసిడి రేట్లు

ఆభరణం రూపంలోనే కాదు.. పెట్టుబడుల కోసమైనా, బహుమతిగా ఇవ్వాలన్నా బంగారం  బంగారమే. భారతీయ సంస్కృతిలో పసిడి ఓ భాగమైపోయింది మరి. ఇటీవల కాలంలో బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మరీ ముఖ్యంగా అమెరికా, చైనా టారిఫ్‌ వార్‌తో ధర మరింత పెరిగిపోతోంది. 

గ్రేటర్‌లో 24 క్యారెట్ల తులం బంగారం ఏకంగా రూ.96 వేలను దాటేసింది. పసిడి ధరలు పెరుగుతున్నా అమ్మకాలు ఏమాత్రం తగ్గడం లేదు. లక్ష మార్క్‌ను దాటుతుందేమోనని నగరవాసులు కొనుగోళ్లు పెంచారు. మరోవైపు శుభకార్యాలు, పండుగల సీజన్‌ కావడంతో బంగారం దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి.  – సాక్షి, సిటీబ్యూరో

దేశంలో కర్ణాటకలో కోలార్‌లో, మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కొంత మొత్తంలో బంగారం, వజ్రాల గనులున్నాయి. ఇవి దేశీ మార్కెట్‌కు ఏ మాత్రం సరిపోవు. ఏటా డిమాండ్‌ పెరుగుతుండటంతో ప్రస్తుతం అమెరికా, ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా, స్విట్జర్లాండ్, అరబ్‌ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ఏర్పడుతున్న ఆర్థిక సంక్షోభం కారణంగా మనం దిగుమతి చేసుకుంటున్న వస్తువుల ధరలపై కూడా ప్రభావం పడుతోంది. 

అలాగే దేశీయంగా చూస్తే కేంద్రం కొత్త పాలసీలు ప్రకటించినప్పుడు ధరలు కాస్త పెరగడం.. లేకుంటే కాస్త తగ్గడం వంటివి కూడా జరుగుతుంటాయి. ఏటా మన దేశానికి దిగుమతి అయ్యే బంగారంలో 20–25 శాతం హైదరాబాద్‌ మార్కెట్‌కు చేరుతుందని గోల్డ్, సిల్వర్‌ జ్యువెలరీ అండ్‌ డైమండ్స్‌ మర్చెంట్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు చెబుతున్నారు. రోజుకు 50–60 కిలోల అమ్మకం.. 

గ్రేటర్‌లో బంగారం ధరలు భారీగా 
పెరుగుతున్నాయి. మార్చి 14న తులం బంగారం ధర రూ.86,420గా ఉండగా.. ఏప్రిల్‌ 12 నాటికి ఏకంగా 96,880లకు పెరిగింది. నెల రోజుల్లో రూ.10 వేలకు పైగానే ధర పెరిగింది. ఇదిలా ఉండగా దేశంలోని ప్రధాన మెట్రో నగరాల కంటే మన నగరంలోనే పసిడి ధరలు తక్కువగా ఉండటం గమనార్హం. 

శనివారం అత్యధికంగా బెంగళూరు 24 క్యారెట్ల బంగారం ధర రూ.97 వేలు ఉండగా.. ఆ తర్వాత చెన్నైలో రూ.96,930, విశాఖపట్నంలో రూ.96,890గా ఉంది. నగరంలో సికింద్రాబాద్, సీతంబర్‌ బజార్, చార్‌కమాన్‌ ప్రాంతాలు ప్రధానమైన బంగారం మార్కెట్లు. ఆయా ప్రాంతాల్లో రోజుకు 50–60 కిలోల 24 క్యారెట్ల ముడి బంగారం అమ్ముడవుతుందని అంచనా. 

ధరలు ఆకాశాన్నంటాయి.. 
పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో పేద, మధ్యతరగతికి అవస్థలు తప్పవు. పెరిగిన ధరలు వీరికి భారంగా మారనున్నాయి. వారం క్రితం తగ్గిన ధరలు అమాంతం పెరిగాయి. – నర్మద, గృహిణి

లక్ష ఎప్పుడో దాటాలి.. 
తులం బంగారం రూ.లక్ష ఎప్పుడో దాటిపోవాల్సింది. అంతర్జాతీయంగా మార్కెట్ల ఒడిదుడుకులు, యూఎస్‌–చైనా టారిఫ్‌ వార్‌తో లక్ష మార్క్‌ను ఇంకా చేరుకోలేదు. పండుగలు, శుభకార్యాల సీజన్‌ రానుండటంతో త్వరలోనే లక్ష దాటుతుందని అంచనా.   – కంకర్ల రాకేష్, బంగారం, వెండి వ్యాపారి 

ధరలపై నియంత్రణ ఉండాలి.. 
బంగారం ధరలు సున్నితంగా ఉంటే బాగుంటుంది. ఎప్పుడు పెరుగుతుందో.. తగ్గుతుందో తెలియడంలేదు.. అందుకే ధరలపై నియంత్రణ ఉండాలి. లేకపోతే కొనేవారికి ఇబ్బందులు తప్పవు. – సంతోషిణి (గృహిణి) 

ఎందుకు పెరుగుతుందంటే.. 
దేశంలో బంగారం ధరలు యూఎస్‌ డాలర్, ఇండియన్‌ రూపీ మారకపు రేట్ల మీద ఆధారపడి ఉంటుంది. దీంతో పాటు పన్నులు, కస్టమ్స్‌ సుంకాలు, వాణిజ్య నిబంధనలతో పాటు మార్కెట్‌ సెంటిమెంట్లు, వాణిజ్యం, పెట్టుబడుల ప్రవాహం వంటివి ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయ పరిణామాలతో బంగారం ధర భారీగా పెరుగుతోంది. స్థానిక జ్యువెలర్లు, రిటైలర్ల నుంచి అధిక డిమాండ్‌ కనిపిస్తుంది. 

యూఎస్‌–చైనా మధ్య వాణిజ్య యుద్ధానికి తెరలేవడంతో సురక్షిత సాధనంగా పరిగణించే బంగారానికి అంతర్జాతీయంగా డిమాండ్‌ పెరుగుతోంది. బంగారం త్వరలోనే 10 గ్రాములకు రూ.లక్ష మార్క్‌ను చేరుకునే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. టారిఫ్‌లపై అనిశ్చితి, బలహీన వృద్ధి, అధిక ద్రవ్యోల్బణం, భౌగోళిక ఉద్రిక్తతలతో బంగారంలో పెట్టుబడులు మరింత ఆశావహంగా కనిపిస్తున్నాయి. గత ఐదేళ్లలో దేశంలో బంగారం ధరలు ఏటా 20 శాతం వరకు పెరుగుతూ వస్తున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement