
గత ఏడాది కురిసిన వర్షాలకు మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రావిరాల చెరువు కట్ట తెగిన దృశ్యం
గతేడాది వర్షాలు..వరదలతో దెబ్బతిన్న చెరువులు.. కట్టలు తెగి గండ్లు, మరమ్మతులకు గురైన తూములు
వానాకాలం వచ్చినా పూర్తిస్థాయిలో జరగని రిపేర్లు.. నేటి నుంచి మృగశిర కార్తె.. ముమ్మరమవనున్న వ్యవసాయ పనులు
ఊరు కళతప్పింది..
ఊరు పక్కనే నిండుగా చెరువు ఉండేది. అది తెగడంతో చుక్కనీరు లేదు. రెండు పంటలు అయినా, ఇంకా మరమ్మతులు చేయలేదు. పంటలు లేక రైతులు, చేతి పనివారు ఊరు విడిచి వలస వెళుతున్నారు. ఇళ్లకు తాళాలు వేసి ఉండటంతో సందడే లేదు. చెరువు తెగడంతో ఊరు కళ తప్పింది.
– కడారి ఐలయ్య, రావిరాల, మహబూబాబాద్ జిల్లా
సాక్షిప్రతినిధి, ఖమ్మం: వర్షాకాలం వచ్చేసింది. నైరుతి మేఘ ఘర్జన రాష్ట్రమంతా ప్రతిధ్వనిస్తోంది. తెలంగాణలో వర్షాలు దంచికొడితే, వాగులు, వంకల్లోని నీటి నంతా ఒడిసిపట్టేది చెరువులు, కుంటలే. కానీ, చాలా చోట్ల ఈ చిన్ననీటి వనరులు ఇప్పుడు నీటిని నింపుకోలేని పరిస్థితిలో ఉన్నాయి. గతేడాది సెప్టెంబర్, అక్టోబర్లో కురిసిన వర్షాలు, వరదల కారణంగా వేల సంఖ్యలో చెరువులు దెబ్బతిన్నాయి.
గండ్లు పడటంతోపాటు తూములు కొట్టుకుపోయాయి. కొన్నిచోట్ల చెరువుల పునరుద్ధరణకు నిధులు మంజూరు చేసినా పనుల్లో పురోగతి లేదు. మరికొన్ని చెరువులు దీనస్థితిలో ఉన్నాయి. దీంతో ఈ చెరువులకు మరమ్మతులు ఎప్పుడు పూర్తిచేస్తారోనని ఆయకట్టు రైతులు ప్రభుత్వ అధికారులవైపు ఆశగా ఎదురుచూస్తున్నారు.
సీజన్ మొదలైనా..
ఆదివారం మృగశిర కార్తె ప్రారంభమవుతోంది. దీంతో రైతులు వ్యవసాయ పనులు ముమ్మరం చేస్తారు. కానీ, కట్టలు తెగిన, తూములు దెబ్బతిన్న చెరువుల మరమ్మతులకు నిధులు మంజూరైనా పనులు ఇంకా పూర్తి కాలేదు. ఇప్పటికే కట్టలు తెగిన అనేక చెరువుల్లోకి వస్తున్న నీటిని లాక్లు ఎత్తి కిందకు వదులుతున్నారు.
చెరువుల ఆయకట్టు పరిధిలో సాగు ప్రారంభమై.. వర్షాలు కురిసిన సమయంలో లాక్లు ఎత్తితే రైతులు తీవ్రంగా నష్టపోతారు. లాకులు ఎత్తకపోయినా నీరు బయటకు వచ్చే ప్రమాదం ఉంది. దీంతో చెరువుల కింద వేలాది ఎకరాల భూమి బీడుగా మారే ప్రమాదం కనిపిస్తోంది.
వివిధ జిల్లాల్లోని చెరువుల పరిస్థితి ఇదీ..
⇒ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 146 చెరువులకు కట్టలు తెగడంతోపాటు తూములు దెబ్బతిన్నాయి. ఖమ్మం జిల్లాలో 11 చెరువులకు రూ.9.55 లక్షలతో తాత్కాలిక మరమ్మతులు పూర్తి చేశారు. రూ.48.61 కోట్లతో 45 చెరువులకు మరమ్మతులు చేశారు. 42 చోట్ల పనులు జరుగుతున్నాయి. 17 చోట్ల పనులకు ఉన్నతాధికారుల నుంచి అనుమతులు రావాల్సి ఉంది.
⇒ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 28 చెరువులకు గండ్లు పడగా.. 25 చెరువులకు గండ్లు పూడ్చారు. అశ్వారావుపేట మండలంలో 16 వేల ఎకరాల ఆయకట్టు ఉన్న పెద్దవాగు ప్రాజెక్టుకు భారీ గండి పడగా రూ.3 కోట్లతో తాత్కాలికంగా మరమ్మతులు చేశారు. కోతకు గురైన కట్టను మాత్రం వదిలేశారు. ఈ పెద్దవాగు తెలంగాణ, ఏపీ మధ్య ఉండటంతో వివాదం నెలకొంది. రీ డిజైన్ కోసం రూ.19 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. అయితే ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలను ఇంకా ఆమోదించలేదు. దీంతో రీడిజైన్కు మోక్షం లభించలేదు.
⇒ ఖమ్మం జిల్లా చింతకాని మండలం తిమ్మినేనిపాలెంలోని గచ్చుబంధం చెరువు కట్ట గత సెప్టెంబర్ వరదలకు తెగింది. దీంతో మూడు గ్రామాల్లోని 228 ఎకరాల ఆయకట్టుకు కొంత నష్టం వాటిల్లింది. మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.9 లక్షలు విడుదల చేయగా, ఇరిగేషన్ అధికారులు నేటికీ పనులు చేపట్టలేదు. చెరువులో నీటిని నిల్వ ఉంచే పరిస్థితి లేకపోవడంతో లాకులు ఎత్తి బయటకు పంపుతున్నారు. చెరువు కట్టకు మరమ్మతులు చేయకపోతే ఆయకట్టు పరిధిలోని తమ భూములను బీళ్లుగా వదిలేయాల్సిందేనని రైతులు వాపోతున్నారు.
⇒ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో ఎంపిక చేసిన 25 చెరువుల మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదన పంపారు. ఇప్పటివరకు నయా పైసా నిధులు మంజూరు కాలేదు. మోర్తాడు మండల కేంద్రంలోని ముసలమ్మ చెరువు, కమ్మర్పల్లిలోని పల్లె చెరువు తూముల మరమ్మతు అత్యవసరంగా చేపట్టాల్సి ఉంది. అందుకోసం రూ.50 లక్షల వరకు అవసరమని అంచనా.
⇒ యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని కుర్రారం ఊర చెరువు మత్తడి వర్షాలకు పూర్తిగా కొట్టుకుపోయింది. ఇప్పటివరకు తాత్కాలిక మరమ్మతులే చేపట్టారు. 80 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు నిండితే ఆయకట్టు ప్రాంతంలోని 10 గ్రామాల్లో 5 వేల ఎకరాల్లో పంటలు సాగవుతాయి.
⇒ మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రావిరాల గ్రామం చెరువు 152 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ చెరువు కింద 650 ఎకరాలు నేరుగా, మరో 500 ఎకరాలు బోర్లు, బావుల ద్వారా సాగవుతుంది. గత ఏడాది వచ్చిన వరదలకు చెరువు తెగిపోయింది. ఇప్పుడు సాగు చేద్దామంటే నీళ్లు లేవు. దీంతో రైతులు, కూలీలతోపాటు చేతి వృత్తుల వారు వందకుపైగా కుటుంబాలు వలస వెళ్లాయి. నీళ్లు వస్తే కానీ ఊరికి రాలేమని చెబుతున్నారు. ఈ చెరువు మరమ్మతుల కోసం రూ.1.43 కోట్లు అవసరమని అంచనా వేయగా, ఇప్పుడు రూ.53 లక్షల మాత్రమే మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
తగ్గనున్న భూగర్భ జలాలు..
చెరువుల్లో నీరు పుష్కలంగా ఉంటే భూగర్భ జలాలు కూడా పెరుగుతాయి. ప్రస్తుతం చెరువులు దెబ్బతినడంతో వాటిలో నీరు నిల్వలేదు. దీంతో భూగర్భ జలాలు కూడా పడిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. చెరువులకు సకాలంలో మరమ్మతులు పూర్తి చేయకపోవడంతో తమ భూములు సాగుచేసుకోలేకపోతున్నామని చెబుతున్నారు. చెరువుల్లో నీరు లేకపోవటంతో మత్స్యకారులు కూడా ఉపాధి కోల్పోయారు.
కుటుంబాలకు కుటుంబాలే వలస వెళ్లారు
మా ఊళ్లో 121 ముదిరాజు, 40 గంగపుత్రుల కుటుంబాలు చెరువునే నమ్ముకొని జీవిస్తున్నాయి. పోయిన వానాకాలం చెరువు తెగడంతో పనులు లేక, ఇక్కడ ఉండి పస్తులు పడలేక హైదరాబాద్ వెళ్లి అడ్డా పనులు చేస్తున్నారు. చెరువు గండ్లు తొందరగా పూడిస్తేనే మా కష్టాలు పోతాయి.
– డేగల యాకయ్య, మత్స్యకారుడు, రాజుల కొత్తపల్లి, మహబూబాబాద్ జిల్లా