‘అమ్మా.. నీకేమైందమ్మా! | Daughter in tears after mother dies giving birth to stillborn baby | Sakshi
Sakshi News home page

‘అమ్మా.. నీకేమైందమ్మా!

Apr 17 2026 4:13 AM | Updated on Apr 17 2026 4:13 AM

Daughter in tears after mother dies giving birth to stillborn baby

శారద మృతదేహం వద్ద విలపిస్తున్న తల్లి , తండ్రి వద్ద కూర్చొని రోదిస్తున్న చిన్నారి

కోల్‌సిటీ (రామగుండం): మరికాసేపట్లో చిట్టి చెల్లినో లేక తమ్ముడినో ఎత్తుకుంటానని ఆశపడిన ఓ చిన్నారి.. తన తల్లి మృత శిశువును ప్రసవించి కన్నుమూయడంతో హతాశురాలైంది. ‘అమ్మా.. నీకేమైంది అమ్మా..’ అంటూ ఆస్పత్రి మెట్లపై కూర్చొని తండ్రిని హత్తుకొని విలపించింది. ఈ విషాద ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగింది.  మంచిర్యాల జిల్లా చెన్నూర్‌ మండలం నాగపూర్‌ గ్రామానికి చెందిన  శారద (26), హరికృష్ణ దంపతులకు ఏడేళ్ల కుమార్తె ఉంది. 

మూడేళ్ల క్రితం ఓ శిశువు పుట్టి మరణించగా 6 నెలల క్రితం శారద మళ్లీ గర్భం దాల్చింది. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో బుధవారం గోదావరిఖనిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉందని జీజీహెచ్‌కు రెఫర్‌ చేశారు. దీంతో వెంటనే ఆమె అక్కడ అడ్మిట్‌ చేశారు. శారదను పరీక్షించిన వైద్య బృందం ఆమెకు తీవ్ర రక్తహీనత ఉన్నట్లు గుర్తించింది. పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారడంతో అత్యవసర శస్త్రచికిత్స చేసింది. తక్కువ బరువుతో బుధవారం రాత్రి శారద మృత ఆడశిశువుకు జన్మనిచ్చింది.

అయితే రక్తస్రావం, ఇతర సమస్యలతో ఆమె గురువారం కన్నుమూసింది. తల్లి మృతదేహాన్ని చూసిన కుమార్తె గుండెలవిసేలా రోదించింది. రోగిని బతికించేందుకు ప్రయత్నించినప్పటికీ రక్తహీనత, గర్భసంచిలో రక్తస్రావం, అవయవాల వైఫల్యంతో శారద మరణించిందని గైనకాలజీ హెచ్‌వోడీ అరుణ చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement