
అమ్రాబాద్ (అచ్చంపేట): ముస్లిం యువకులు మానవత్వంతో ముందుకు వచ్చి కరోనా మృతుడికి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో జరిగింది. అమ్రాబాద్ మండలం తిర్మలాపూర్ (బీకే)కు చెందిన ఎల్కచేను తిరుపతయ్య (50) కిడ్నీవ్యాధిగ్రస్తుడు. ఈ నెల 16వ తేదీన మహబూబ్నగర్లోని ఎస్వీఎస్ ఆస్పత్రికి వెళ్లగా అక్కడ కరోనా పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్గా నిర్ధారణ కావడంతో హోం ఐసోలేషన్లో ఉండాలని వైద్యులు సూచించారు. పెళ్లి అయిన కొన్నేళ్లకు భార్య పిల్లలతో కలసి పుట్టింటికి వెళ్లిపోవడంతో ఒంటరివాడైన తిరుపతయ్యకు ఇల్లు కూడా సరిగా లేదు.
వారం కిందట స్థానిక వైద్యాధికారి వచ్చి రెండోసారి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలడంతో జిల్లాకేంద్రంలోని ఐసోలేషన్ సెంటర్కు తరలించారు. శుక్రవారంరాత్రి అమ్రాబాద్కు ఎలాగో వచ్చే ఓ పాడుపడిన ఇంటి ఎదుట శనివారం తెల్లారుజామున మృతి చెందాడు. భార్యతోపాటు బంధువులకు పోలీసులు సమాచారమిచ్చినా ఎవరూ రాలేదు. అమ్రాబాద్కు చెందిన అబ్దుల్ ఖదీర్, ఇస్మాయిల్ అలీ, హసన్ అలీ, అక్రమ్ ముందుకు వచ్చి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించి ఖననం చేశారు.
చదవండి: దొరక్క దొరికిన ఆస్పత్రి బెడ్.. అంతలోనే
చదవండి: టీకా వేసుకున్న భర్త.. ఆ తర్వాత భార్య