‘తలరాతను మార్చేది చదువొక్కటే.. మీకేం కావాలో నాకు చెప్పండి’ | CM Revanth Reddy to Launch Young India Student Kits Distribution Programme | Sakshi
Sakshi News home page

‘తలరాతను మార్చేది చదువొక్కటే.. మీకేం కావాలో నాకు చెప్పండి’

Jun 19 2026 6:12 PM | Updated on Jun 19 2026 7:42 PM

CM Revanth Reddy to Launch Young India Student Kits Distribution Programme

సాక్షి,హైదరాబాద్‌: రాష్ట్ర,దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.  ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ శుక్రవారం (జూన్ 19) హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఘనంగా ప్రారంభించారు. రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో కలిసి సీఎం విద్యార్థులకు స్టూడెంట్ కిట్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ మాట్లాడుతూ.. ‘‘అరవై ఏళ్ల సుదీర్ఘ పోరాటం, వందలాది మంది యువత ఆత్మ బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉందని మేం సంపూర్ణంగా విశ్వసించాం. విధ్వంసమైన విద్యా వ్యవస్థను వికాసం వైపు నడిపించాలని నిర్ణయించాం. అందుకే బడ్జెట్‌లో విద్య కోసం 8.5 శాతం నిధులు కేటాయించాం.

విద్యా అభివృద్ధికి రూ. 26,600 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.ఇది ఖర్చుగా కాదు…భవిష్యత్ తరాల కోసం పెట్టుబడిగా మేం భావిస్తాం. పదేళ్లు అధికారంలో ఉన్న వాళ్లు విద్యకు ప్రాధాన్యత ఇవ్వలేదు.పదేళ్లు అధికారంలో ఉన్నవాళ్లు డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచలేదు. మేం అధికారంలోకి రాగానే డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచాం.ప్రభుత్వ పాఠశాలలు మూసివేసి విద్యా వ్యవస్థను విధ్వంసం చేశారు

విద్యా శాఖకు మంత్రి లేడంటూ కొందరు మాట్లాడుతున్నారు. పదేళ్లు వాళ్లు చేసిన విధ్వంసంతో వందేళ్ల నష్టం జరిగింది. అందుకే విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి పేదలకు విద్య అందించాలని విద్యాశాఖను నా దగ్గరే పెట్టుకున్నా. ప్రీ ప్రైమరీ విధానం తీసుకొచ్చి ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను పునరుద్ధరిస్తున్నాం.ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డు పెట్టాల్సి వస్తుందని ఎవ్వరూ కలలో కూడా ఊహించి ఉండరు

ఆరుట్ల పబ్లిక్ స్కూల్ ఏర్పాటుతో  అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాం.యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించి దేశానికే ఆదర్శంగా తెలంగాణను నిలపబోతున్నాం. రాబోయే ఒలంపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. ఏఐ తుఫాన్‌తో  కోట్లాదిమంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. అందుకే బ్లూ కాలర్ జాబ్స్ వైపు దృష్టి సారించాం.

యువతకు నైపుణ్య శిక్షణ అందించే కార్యక్రమాన్ని చేపట్టాం. ఇంగ్లీష్ తో పాటు జర్మనీ, జపాన్ భాషను నేర్పిస్తున్నాం .ఐటీఐలను ఏటీసీలుగా మార్చాం… స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకున్నాం.. మీలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసి పదును పెట్టి గొప్ప వాళ్లుగా తీర్చిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది

సోషల్ వెల్ఫేర్‌లో చదువుకున్న విద్యార్థులు డాక్టర్లుగా, ఐఏఎస్ లుగా, ఐపీఎస్ లుగా, రాజకీయ నాయకులుగా ఎదగాలి. మీరంతా తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి.దేశాన్ని నడిపించే శక్తిగా ఎదగాలి.రేపటి భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది..మీ తలరాతను మార్చేది చదువొక్కటే. మీరు చదవండి… మీకు ఏం కావాలో ఇచ్చే బాధ్యత మీ రేవంతన్న తీసుకుంటాడు. 27.50 లక్షల మంది విద్యార్థులకు ఇవాళ యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్స్ అందిస్తున్నాం . తెలంగాణను ఎడ్యుకేషన్ హబ్‌గా, స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నాం’అని స్పష్టం చేశారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement