కొత్త ‘ఉస్మానియా’కు నెలాఖరులోగా శంకుస్థాపన | CM Revanth Reddy Key Orders to Officials Over New Osmania Hospital: Telangana | Sakshi
Sakshi News home page

కొత్త ‘ఉస్మానియా’కు నెలాఖరులోగా శంకుస్థాపన

Jan 12 2025 5:10 AM | Updated on Jan 12 2025 5:10 AM

CM Revanth Reddy Key Orders to Officials Over New Osmania Hospital: Telangana

కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణ ప్రాంత మ్యాపులను పరిశీలిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి

అత్యాధునిక వసతులతో ఆస్పత్రికి కొత్త భవన

నిర్మాణం.. అధికారులకు సీఎం రేవంత్‌ ఆదేశం

ప్రతిపాదిత గోషామహల్‌ స్టేడియం ప్రాంతం వివరాలపై ఆరా

సాక్షి, హైదరాబాద్‌: ఉస్మానియా ఆస్పత్రి కోసం నూతన భవన నిర్మాణానికి ఈ నెలాఖరులోగా శంకుస్థాపన చేయాలని, ఇందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈ అంశంపై శనివారం తన నివాసంలో అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. కొత్త ఆస్పత్రిని నిర్మాణం కోసం ప్రతిపాదించిన గోషామహల్‌ స్థలానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్‌ శాఖ పరిధిలో ఉన్న ఆ స్థలాన్ని వీలైనంత త్వరగా వైద్యారోగ్య శాఖకు బదిలీ చేయాలని అధికారులను ఆదేశించారు. రెండు శాఖల మధ్య భూబదలాయింపు ప్రక్రియ, ఇతర పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా ప్రతిపాదిత స్థలంలో చేపట్టాల్సిన నిర్మాణాలకు సంబంధించిన నమూనా మ్యాపులను అధికారులు సీఎంకు వివరించారు. అందులో సీఎం పలు మార్పులు, చేర్పులను సూచించారు. అన్ని రకాల ఆధునిక వసతులతో ఆస్పత్రి నిర్మాణం జరపాలని స్పష్టం చేశారు. రోడ్లు, పార్కింగ్, మార్చురీ, ఇతర మౌలిక సదుపాయాల విషయంలో భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు.

భవిష్యత్తులో సమీపంలో రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్ల వంటి నిర్మాణాలు చేపట్టినా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ముందుచూపుతో డిజైన్లను తయారు చేయాలని ఆదేశించారు. రోగుల సహాయకులు సేదతీరేందుకు గ్రీనరీ, పార్క్‌ వంటి సదుపాయాలు ఉండేలా చూడాలన్నారు. కార్పొరేట్‌ ఆస్పత్రులకు దీటుగా అత్యాధునిక వసతులతో ఆస్పత్రి నిర్మాణం జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని.. ఈ మేరకు పూర్తిస్థాయి డిజైన్లను రూపొందించాలని ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement