
హైదరాబాద్: నోవాటెల్ హోటల్ లో సీఎం రేవంత్ రెడ్డికి ప్రమాదం తప్పింది. ఆయన ఎక్కిన లిఫ్ట్ లో స్వల్ప అంతరాయం ఏర్పడి కాస్త కిందకు కుంగిపోయింది. ఎనిమిది మంది ఎక్కాల్సిన లిఫ్ట్ లో 13 మంది ఎక్కడంతో లిఫ్ట్ మొరాయించింది. లిఫ్ట్ మొరాయించడమే కాకుండా ఓవర్ వెయిట్ కారణంగా ఉండాల్సిన ఎత్తు కంటే కొంత లోపలికి దిగిపోయింది. దీంతో సీఎం రేవంత్ సహా అధికారులు, సిబ్బంది ఆందోళన చెందారు. కాసేపు అంతా అయోమయానికి గురయ్యారు.
ఈ క్రమంలోనే హోటల్ సిబ్బంది, సీఎం సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆ లిఫ్ట్ ను ఓపెన్ చేసి వేరే లిఫ్ట్ లో సీఎం రేవంత్ ను పంపారు. ఈరోజు(మంగళవారం) నోవాటెల్ హోటల్ లో జరిగిన సీఎల్పీ సమావేశంలో భాగంగా రేవంత్ అక్కడకు హాజరైన క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
పార్టీలోని నేతలకు సీఎం రేవంత్ వార్నింగ్
సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్.. పార్టీలో నిరసన గళం వినిపిస్తున్న నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీ లైన్ దాటి మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇక్కడ ఎవరూ పేర్లు ప్రస్తావించకుండా రేవంత్ ఆయా నేతలను ఉద్దేశించి మాట్లాడారు. పదవులు ఎవరికి ఇవ్వాలనేది అధిష్టానం చూసుకుంటుంది. మంత్రి పదవి కోరే వాళ్లు మాట్లాడితే వారికే నష్టం. ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు. అలా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువ. పార్టీకి ఇబ్బంది కలిగిస్తే నేతలే ఇబ్బందులు ఎదుర్కుంటారు’’ అంటూ రేవంత్ తేల్చి చెప్పారు. మంత్రివర్గ విస్తరణపై అధిస్థానం నిర్ణయమే ఫైనల్. మంత్రివర్గ విస్తరణపై ఎవరేం మాట్లాడినా ఉపయోగం లేదన్నారు.
గతద్ది రోజులుగా పార్టీలో పదవులు తమకు కావాలంటే తమకు కావాలనే వార్ నడుస్తోంది. ప్రధానంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావులు పార్టీ పదవులపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. అయితే తమకు పదవులు రావేమోననే భయం కూడా వారిలో ఉంది. అందుకే ముందు జాగ్రత్తగా అధిష్టానానిని తమదైన శైలిలో హెచ్చరికలు పంపుతున్నారు. దీనిపై రేవంత్ తీవ్రంగా స్పందించారు. మీ మాటల వల్ల ఎటువంటి ఉపయోగం లేదని, అధిష్టాన నిర్ణయమే ఫైనల్ అంటూ తేల్చిచెప్పారు.
ఇదీ చదవండి: