సాక్షి,ఆదిలాబాద్ : తల్లిదండ్రులు చనిపోయి అనాధలుగా మారిన గిరిజన ‘తోటి’ కులానికి చెందిన ఇద్దరు చిన్నారులకు సీఎం ప్రజావాణి అండగా నిలిచింది. శుక్రవారం మహాత్మా జ్యోతిబాపూలే ప్రజా భవన్లో జరిగిన సీఎం ప్రజావాణికి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఏజెన్సీ ప్రాంతానికి చెందిన అనాధ పిల్లలను వారి బంధువులు తీసుకువచ్చారు.
రెండేళ్లు, మూడు నెలల చిన్నారుల పోషణ కష్టంగా ఉందని వారి సంరక్షణ చూస్తున్న పెదనాన్న పెద్దమ్మ ఆత్రం సునీత, వెంకటిలు సీఎం ప్రజావాణి ఇన్ఛార్జ్ చిన్నారెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయం తెలుసుకొని చలించిపోయిన చిన్నారెడ్డి ఇద్దరు చిన్నారులకు స్పాన్సర్షిప్ అందించాలని కోరుతూ ఆదిలాబాద్ కలెక్టర్ కు లేఖ రాశారు.
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం రాంజీ గోండు నగర్ గ్రామానికి చెందిన ఆత్రం విఠల్, గంగుబాయి ఆరు నెలల కాలంలో మృతి చెందడంతో ఇద్దరు చిన్నారులు అనాధలుగా మారారు. దీంతో ఆ చిన్నారుల బాధ్యతలు వారి పెదనాన్న పెద్దమ్మ చూస్తున్నారు. కనీసం డబ్బా పాలు కూడా కొనలేని దీనస్థితిలో ఉన్నామని వారు చిన్నారెడ్డి దృష్టికి తీసుకొని వచ్చారు. ప్రతినెల ఆర్థిక సాయంతో పాటు డబ్బా పాలను చిన్నారులకు అందించే బాధ్యత తీసుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్కు చిన్నారెడ్డి సూచించారు.


