బేగంపేట ప్లాజాలో ప్రారంభించనున్న మంత్రి జూపల్లి
హాజరుకానున్న 150 మంది విదేశీ ప్రతినిధులు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించిన గౌతమ బుద్ధుని బోధనలను చాటిచెప్పేందుకు హైదరాబాద్ వేదిక వేదిక కానుంది. తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (టీజీటీడీసీ) అనుబంధ విభాగం ‘బుద్ధవనం’, వియత్నాం బౌద్ధ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ‘ప్రపంచ శాంతి – అంతర్జాతీయ బౌద్ధ మహాసభలు–2026’శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 27 నుంచి 29 వరకు హైదరాబాద్, నాగార్జునసాగర్ వేదికలుగా ఈ సదస్సు నిర్వహించనున్నారు.
బేగంపేటలోని టూరిజం ప్లాజాలో శుక్రవారం ఉదయం 10 గంటలకు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, శ్రీలంక బౌద్ధ శాసన, సాంస్కృతిక వ్యవహారాల మంత్రి ప్రొఫెసర్ హినిదుమ సునీల్ సేనవి ముఖ్య అతిథులుగా హాజరై ఈ మహాసభలను ప్రారంభించనున్నారు. ఈ మహాసభలకు అర్జెంటీనా, బెల్జియం, కంబోడియా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, మలేషియా, మయన్మార్, దక్షిణ కొరియా, శ్రీలంక, థాయిలాండ్, వియత్నాం సహా 22 దేశాల నుంచి సుమారు 150 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. బౌద్ధ ధర్మం, విశ్వశాంతి అనే అంశాలపై వారు పరిశోధన పత్రాలను సమర్పించనున్నారు.


