ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ కాస్తా ఆర్‌పీ ట్యాక్స్‌ : ఏలేటి మహేశ్వర్‌రెడ్డి | Alleti Maheshwar Reddy on revanth reddy | Sakshi
Sakshi News home page

ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ కాస్తా ఆర్‌పీ ట్యాక్స్‌ : ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

Jul 3 2026 2:33 AM | Updated on Jul 3 2026 2:33 AM

Alleti Maheshwar Reddy on revanth reddy

సాక్షి, హైదరాబాద్‌: కర్ణాటకలో మాదిరిగానే ఇక్కడా సీఎంగా రేవంత్‌రెడ్డిని మార్చాలని ఒరిజినల్‌ కాంగ్రెస్‌నేతలు పట్టుబట్టడంతో రాహుల్‌ గాందీ, మల్లిఖార్జున ఖర్గే అందుకు ప్రయత్నించినా ప్రియాంకా గాందీ, కేసీ వేణుగోపాల్‌ అడ్డుపడ్డారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం మహేశ్వర్‌రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ నెల నెలా రెన్యువల్, రీచార్జ్‌ సీఎంగా రేవంత్‌ మారారని, ఢిల్లీకి మూటలు పంపినంత కాలం ఇది కొనసాగే అవకాశాలున్నాయని వ్యాఖ్యానించారు. 

గతంలో రేవంత్‌–రాహల్‌ (ఆర్‌ఆర్‌)ట్యాక్స్‌కు బదులు ఇప్పుడు రేవంత్‌–ప్రియాంక (ఆర్‌పీ)ట్యాక్స్‌గా పరిస్థితులు మారాయని చెప్పారు. సీఎం తీరుపై హైకమాండ్‌కు ఎనిమిది మంది మంత్రులు ఫిర్యాదు చేసినట్లు తెలిసిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి పూర్తిగా దిగజారిందని, దాదాపు వంద నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీలో కాంగ్రెస్‌ థర్డ్‌ప్లేస్‌కు పరిమితమైందని, రేవంత్‌రెడ్డి రెండేళ్ల పాలనపై తాజాగా కాంగ్రెస్‌ ఎన్నికల వ్యూహకర్త సునీల్‌ కనుగోలు నివేదిక సమర్పించారని ఆయన పేర్కొన్నారు. 

రాష్ట్రంలో అధికారపార్టీ పరిస్థితి ఇంత దయనీయంగా ఉంది కాబట్టే జిల్లా, మండల పరిషత్, మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు నిర్వహించే ధైర్యం సీఎం చేయడం లేదన్నారు. హైదరాబాద్‌లోని మూడు కార్పొరేషన్లలో ఎంఐఎం సొంతంగా పోటీచేసిన పక్షంలో ఘోర ఓటమి చవిచూడాల్సి వస్తుందనే భయం రేవంత్‌కు పట్టుకుందన్నారు. రైతుబంధు నిధులు ఖాతాల్లో వేసినా కూడా జిల్లాపరిషత్‌ ఎన్నికలు జరిపే యోచన ప్రభుత్వం చేయడం లేదన్నారు. సగానికి పైగా ఉమ్మడి జిల్లాల్లో బీజేపీ బలపడగా, ఉమ్మడి పాలమూరు జిల్లాలో కూడా కాంగ్రెస్‌ బలహీనపడిందని, ఎన్నికలు జరిగితే రెండు సీట్లలోనే గెలుస్తుందని కనుగోలు నివేదికలో ఉందన్నారు. హిట్లర్‌ ఆదర్శమని రేవంత్‌ చేసిన వ్యాఖ్యలతో తీవ్రవ్యతిరేకత నెలకొందని, ఆయన ఇమేజీకి కూడా డ్యామేజీ జరిగిందని ఈ నివేదికలో పేర్కొన్నారని మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. 

రేవంత్‌ ప్రవర్తన, అనుసరిస్తున్న తీరు వల్ల ఒరిజినల్‌ కాంగ్రెస్‌ నేతలు వేధింపులకు, నిరాదరణకు గురౌతున్నారని రాష్ట్ర ఇన్‌చార్జీ మీనాక్షి నటరాజన్‌ కూడా రాహుల్‌గాం«దీకి ఓ నివేదికను సమర్పించారని చెప్పారు. మొత్తంగా 12 మంది మంత్రులతో పాటు 34 మంది ఎమ్మెల్యేలు రేవంత్‌ను వ్యతిరేకిస్తున్నారని ఈ రిపోర్ట్‌లో వెల్లడైందన్నారు. ఇక్కడ జరుగుతున్న అనేక అవినీతి కార్యక్రమాలపై మీనాక్షి నివేదిక ఇచ్చినందునే ఆమెకు రాజ్యసభ సభ్యత్వం దక్కకుండా చేశారని ఏలేటి ఆరోపించారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement