సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నిన్న ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బతో 22 మంది మృతిచెందారు. ఎండదెబ్బ దాటికి ఒక్క వరంగల్ జిల్లాలోనే తొమ్మిది మంది మరణించారు. అయితే మరో నాలుగు రోజుల పాటు ఎండల ప్రభావం తీవ్రంగా ఉండనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
కాగా ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారాయి. నిన్న( గురువారం) ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్లలో 48.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణలోని ముత్తారం, మునగాలలో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడంతో పాటు రాష్ట్రంలోని 25 ప్రాంతాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఎండలు మండుతుండడంతో ప్రజలెవ్వరూ అత్యవసరమైతే తప్ప బయిటకీ రాకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ వెళ్లినా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.


