తమిళసినిమా: నటుడు సూర్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రాల్లో కరుప్పు ఒకటి. నటుడు ఆర్జే బాలాజీ కథ, దర్శకత్వ బాధ్యతలను నిర్వహించిన ఇందులో నటి త్రిష నాయకిగా నటించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి సాయి అభయంకర్ సంగీతాన్ని అందించారు. కాగా నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే నెల 14న తెరపైకి రానుంది.ఈ సందర్బంగా చిత్ర ఆడియోను ఆదివారం సాయంత్రం మదురైలో నిర్వహించారు. ఈ వేదికపై నటుడు సూర్య మాట్లాడుతూ ఈ చిత్రం ఇంత వరకు రావడానికి కారణం కరుప్పుస్వామినేనని భావిస్తున్నానన్నారు. మనిఫిపై భగవంతుడు ఉండగా జరిగే మార్పును తాను చూస్తున్నట్లు పేర్కొన్నారు. నమ్మకం ఉన్న చోట కచ్చితంగా అద్భుతాలు జరుగుతాయన్నారు. ఈ చిత్ర దర్శకుడు బాలాజీ ప్రతిభావంతుడని అన్నారు. తాను తనను సూర్యగానే చూస్తానని, ఆయన తనను దర్శకుడు, నటుడు,వర్గజాలకుడిగా చూసుకుంటారని అన్నారు. నిజం చెప్పాలంటే ఈ చిత్రంలో తాను హీరో కాదన్నారు. కరుప్పు స్వా మినే హీరో అని పేర్కొన్నారు. చిత్రం చూసేవాళ్లు మొదటి భాగాన్ని చాలా ఎమోషనల్గా చేస్తారని, రెండవ భాగాన్ని ధియేటర్ మూమెంట్స్ అధికంగా ఉంటాయని భావిస్తారన్నారు. మే 14న మీ చేతుల్లోనే ఉందని , కరుప్పు చిత్రం కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకాన్ని సూర్య వ్యక్తం చేశారు. కరుప్పు చిత్రాన్ని కచ్చితంగా అనుకున్న రోజునే విడుదల చేస్తామని దర్శకుడు ఆర్జే.బాలాజీ చెప్పారు. కాగా ఈ కార్యక్రమంలో నటి త్రిష పాల్గొనకపోవడం గమనార్హం.


